ఎస్బీఐ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్! తెలియకుండానే డబ్బు గల్లంతు!
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ. అలాంటి బ్యాంకు ఖాతాల్లోని నగదుకు భద్రత లేకుండా పోయింది.ఎస్బీఐ ఖాతాల నుంచి కస్టమర్లకు తెలియకుండానే భారీ మొత్తంలో నగదు తస్కరణకు గురవుతోంది.
హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ ఖాతాల నుంచి కస్టమర్లకు తెలియకుండానే భారీ మొత్తంలో నగదు తస్కరణకు గురవుతున్నట్టు వెలుగులోకి వచ్చింది. గత రెండు వారాలుగా జరుగుతున్న భారీ ఆన్లైన్ మోసాలపై సైబర్ క్రైం సెల్కు ఫిర్యాదులు పోటెత్తున్నాయి.
ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు నెట్ బ్యాంకింగ్లో భారీగా సొమ్ములు పోగొట్టుకుంటున్నామంటూ... గత వారం రోజులుగా అనేకమంది గగ్గోలుపెడుతున్నారు. ఈ మేరకు టెక్నాలజీ నిపుణుడు శ్రీధర్ నల్లమోతు సైతం ఫేస్బుక్ ద్వారా పలుమార్లు వినియోగదారులను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎస్బీఐ కార్డులు వాడే వినియోగ దారులు జాగ్రత్తగా ఉండాలని... టెక్నాలజీని తక్కువగా అంచనా వేయొద్దని ఆయన హెచ్చరిస్తున్నారు.
ఎస్బీఐ సైబర్ భద్రత విషయంలో ఎక్కడో తేడా జరుగుతోందనీ.. ప్రమాదకరమైన మాల్వేర్ కారణంగానే ఈ మోసాలకు కారణం కావచ్చుని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలియకుండానే ఆస్ట్రేలియా, అమెరికా డాలర్లలో చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. ప్రత్యేకించి ఉబెర్, ఓలా క్యాబ్లతో పాటు అమెజాన్ వంటి సైట్లలో ఆన్లైన్ చెల్లింపులు చేసేవారు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
కస్టమర్లకు తెలియకుండానే క్రెడిట్ కార్డు గరిష్ట పరిమితి చేరేలా నకిలీ లావాదేవీలు జరగుతున్నాయనీ... నెట్బ్యాంకింగ్ ద్వారా భారీ మొత్తంలో సొమ్ములు చేజారుతున్నట్టు తాను గమనించానని వెల్లడించారు. ఎలాంటి లావాదేవీలు జరపకుండానే ఓటీపీలు వస్తున్నాయనీ.. నెట్బ్యాంకింగ్ పాస్వర్డ్లు సైతం పనిచేయకుండా పోతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల అప్రమత్తంగా ఉండాలనీ... రోజుకు మూడు నాలుగు సార్లు ఖాతాలో సొమ్ము చెక్ చేసుకోవాలని శీధర్ నల్లమోతు సూచించారు.
ఇంత జరుగుతున్నా ఈ విషయం ఇప్పటి వరకు వెలుగులోకి రాకపోవడం, ఎస్బీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడక పోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. తాము మోసపోతున్నట్టు బ్యాంకు మేనేజర్ల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.