విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టిచంపిన టీచర్లు
కోల్కతా: క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను విచక్షణా రహితంగా హింసించడం ఇటీవలి కాలంలో కొందరు ఉపాధ్యాయులకు అలవాటుగా మారిపోయింది. విద్యార్థులు తప్పు చేస్తే సున్నితంగా దండించాలి.. కానీ, వారిని హింసించడం సరికాదు. తాజాగా జరిగిన ఓ ఘటనలో ఉపాధ్యాయుల క్రూరత్వానికి ఓ విద్యార్థి బలయ్యాడు. ఈ దారుణ ఘటన పశ్చిమెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ముర్షిదాబాద్ జిల్లాలోని డాక్ బంగ్లా సమీపంలో ఉన్న అల్ ఇస్లామియా మిషన్ పాఠశాలలో 12ఏళ్ల షమీమ్ మాలిక్ సోమవారం సాయంత్రం పాఠశాల బయట తన తల్లిదండ్రులను కలిశాడు. అయితే, హాస్టల్లో అనుమతి తీసుకోకుండా క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డాడని హెడ్ మాస్టర్ హలిఫ్ షేక్, వార్డన్ లీటన్ షేక్ అతడిను చితకబాదారు.

ఒకరి తర్వాత ఒకరు బాలుడిని విచక్షణారహితంగా కొట్టారు. దీంతో షమీమ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. చివరివరకు ప్రాణాలతో పోరాడిన షమీమ్ మంగళవారం ఉదయం మరణించాడు. ఈ మేరకు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు బాధ్యులైన ఇద్దరు టీచర్లను అరెస్టు చేశారు.
నిందితులను కోర్టు ప్రవేశపెట్టగా.. మూడు రోజులపాటు పోలీస్ కస్టడీకి ఆదేశించింది. కాగా, తమ కొడుకుపై టీచర్లు రాక్షసత్వాన్ని ప్రదర్శించారని షమీమ్ తల్లి షమీనా బీబీ తెలిపింది. నిందితులను కఠినంగా శిక్షించి.. తమకు న్యాయం చేయాలని మృతిడి తల్లి వేడుకుంది.












Click it and Unblock the Notifications