బీడీ కింగ్కు జీవితఖైదు: రూ. 71 లక్షలు జరిమానా
తిరువనంతపురం: కేరళలో సంచలనం సృష్టించిన కేసులో స్థానిక కోర్టు నిందితుడికి జీవిత ఖైదు, రూ. 71 లక్షల జరిమానా విధించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త మహమ్మద్ నిషామ్ (39) అనే వ్యక్తికి గురువారం కోర్టు శిక్ష విధించింది. రూ. 71 లక్షల్లో రూ. 50 లక్షలు మృతుడి భార్యకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
బై పొలార్ డిజార్డర్ తో భాదపడుతున్న తనకు తక్కువ శిక్ష విధించాలని మహమ్మద్ నిషామ్ పెట్టుకున్న అర్జీని న్యాయస్థానం తోసిపుచ్చింది. కేరళలోని త్రిశూర్ కు చెందిన మహమ్మద్ నిషామ్ దేశ, విదేశాలకు బీడీలు సరఫరా చేస్తున్నాడు.
ఇతను పెద్ద పారిశ్రామికవేత్త. ఇతనికి బీడీ కింగ్ అనే పేరు ఉంది. గత సంవత్సరం జనవరి 29వ తేది మహమ్మద్ నిషామ్ త్రిశూర్ లో తన హమ్మర్ కారును నిర్లక్షంగా నడిపాడు. అదే సమయంలో పని ముగించుకుని ఇంటికి వెలుతున్న సెక్యూరిటీ గార్డు చంద్రబోస్ ను డీకొన్నాడు.
తీవ్రగాయాలైన చంద్రబోస్ మూడు వారాల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి మరణించాడు. ప్రమాదం జరిగిన తరువాత నిషామ్ బెంగళూరు పారిపోయాడు. బెంగళూరులో పోలీసులు ఇతనిని అరెస్టు చేశారు. రిమాండ్ లో ఉన్న సమయంలో స్టార్ హోటల్ భోజనం చెయ్యడానికి కేరళ పోలీసుల సహాయం తీసుకున్నాడు. ఈ దెబ్బకు ఐదుగురు పోలీసులు సస్పెండ్ అయ్యారు.