ఆలయ పూజారిని చితక్కొట్టి.. ప్యాంట్ విప్పించి ఊరేగించారు..
బెంగళూరు: దక్షిణ కాశీగా పిలుచుకునే బెల్గావి కపిలేశ్వర్ దేవాలయంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. మహిళా భక్తుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న రామా పూజారిపై కొంతమంది యువకులు దాడికి పాల్పడ్డారు. అతని ప్యాంట్ విప్పించి దేవాలయ ప్రాంగణంలో అర్థనగ్నంగా ఊరేగించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆలయ పూజారి అయిన రామా పూజారిపై దేవాలయ నిబంధనలు అతిక్రమిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఆలయ నిబంధనల ప్రకారం రాత్రివేళలో పూజా కార్యక్రమాలు నిర్వహించరాదు. కానీ రామా పూజారి మాత్రం తరుచుగా పూజలు చేస్తూనే ఉన్నాడు.
ఇదే క్రమంలో సోమవారం రాత్రి కూడా పూజలు చేశాడు. అదే సమయంలో కొంతమంది మహిళా భక్తులు దేవాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసేందుకు అక్కడికి వచ్చారు. దీంతో ఆ మహిళలపై మండిపడ్డ పూజారి వారి పట్ల అసభ్యంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.
రామా పూజారిపై గతంలోనూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి మహిళలతో వాగ్వాదానికి దిగిన రామా పూజారిపై వారు తిరగబడ్డారు. కొంతమంది యువకులు అతనిపై పిడిగుద్దులు కురిపించి, ప్యాంట్ విప్పించి నగ్నంగా ఊరేగించారు. స్థానిక మీడియాలో ఇదంతా ప్రచారమైంది.
ఇదిలా ఉంటే, రామా పూజారి నగ్నంగా ఊరేగిస్తున్న సమయంలో అతని సోదరి యాసిడ్ దాడికి పాల్పడింది. రామా పూజారిపై దాడి చేసిన యువకులపై ఆమె యాసిడ్ తో దాడి చేసింది. అనంతరం రామా పూజారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాసిడ్ దాడిలో కొంతమంది యువకులకు గాయాలైనట్టు తెలుస్తోంది. ఖడేబజార్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.