బళ్లారి రెడ్డి బ్రదర్స్ బెయిల్ డీల్ వీడియో: మీడియాతో శ్రీరాములు, సంబంధం లేదు, ఎఫ్ఐఆర్!
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సోదరులకు ప్రస్తుత బళ్లారి బీజేపీ ఎంపీ బి. శ్రీరాములు బెయిల్ ఇప్పించడానికి గతంలో భారీ డీల్ కుదుర్చుకున్నారని ఆరోపణలతో ఓ వీడియో విడుదలై ఇప్పుడు తీవ్రస్థాయిలో చర్చకు దారితీసింది. ఈ విషయంపై బళ్లారి ఎంపీ శ్రీరాములు మీడియాకు వివరణ ఇచ్చారు.
సంబంధం లేదు
గాలి జనార్దన్ రెడ్డి సోదరుల బెయిల్ కోసం, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ వ్యవహారంపై డీల్ జరిగిందంటూ విడుదలైన వీడియోకు తనకు ఎలాంటి సంబంధం లేదు అని బళ్లారి బీజేపీ ఎంపీ శుక్రవారం స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నీచరాజకీయాలు చేస్తోందని బి. శ్రీరాములు ఆరోపించారు.
శ్రీరాముల మీద ఎఫ్ఐఆర్
సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కుటుంబ సభ్యులతో గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం రూ. 160 కోట్లకు డీల్ కుదుర్చుకున్న బళ్లారి బీజేపీ ఎంపీ బి. శ్రీరాములు మీద ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యాలని, ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా అనర్హుడిని చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
ఎవరో వచ్చి మాట్లాడుతారు
కాంగ్రెస్ పార్టీ ఆరోపణలపై శుక్రవారం మీడియాతో మాట్లాడిన బళ్లారి ఎంపీ శ్రీరాములు ఎవరెవరో వస్తారు మాట్లాడుతారు, పోతారు, వాటి గురించి తాను పట్టించుకోనని, ఆ వీడియోకు తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. నాపై ఆరోపణలు చేస్తున్న పత్రి ఒక్కరికీ తాను సమాధానం చెప్పనవసరం లేదని శ్రీరాములు మండిపడ్డారు.
రూ. 2 కోట్లు సీజ్ కేసు
చిత్రదుర్గా జిల్లా మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గంలో బళ్లారి బీజేపీ ఎంపీ, బి. శ్రీరాములు పోటీ చేస్తున్నారు. మాళకాల్మూరు నియోజక వర్గం పరిధిలో గురువారం అర్దరాత్రి స్కార్పియో వాహనంలో రూ. 2 కోట్లను అధికారులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ విషయంపై మాట్లాడిన శ్రీరాములు రూ. 2 కోట్ల కేసు గురించి తనకు తెలీదని స్పష్టం చేశారు.
అమిత్ షా ఆనందం
కర్ణాటకలో బీజేపీ గాలి వీస్తోందని శ్రీరాములు అన్నారు. గురువారం బాగల్ కోటే జిల్లా బాదామిలో అమిత్ షా రోడ్ షో నిర్వహించారని, అక్కడి బీజేపీ కార్యకర్తల ఉత్సాహాన్ని చూసి ఆయన చాల సంతోషపడ్డారని, 140 సీట్లకుపైగా విజయం సాధించి మేమే అధికారంలోకి వస్తామని శ్రీరాములు ధీమా వ్యక్తం చేశారు.