బళ్లారిలో మకాం వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎస్కేప్, అసలే రెడ్డి శిష్యులు!
బళ్లారి/బెంగళూరు: బళ్లారి జిల్లా కంప్లీ శాసన సభ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన జేఎన్. గణేష్ బుధవారం బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష సమావేశానికి డుమ్మాకొట్టడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బళ్లారిలో ఆయన తన సన్నిహితులను కలుసుకుని బిజీబిజీగా గడుపుతున్నారు. ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అయిన ఆనంద్ సింగ్, నాగేంద్ర సైతం అధిష్టానికి అందుబాటులో లేకుండాపోయారు.

ప్రభుత్వం ఏర్పాటు
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ఏపార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. 104 సీట్లతో అతిపెద్దపార్టీగా అవతరించిన బీజేపీ ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇక కాంగ్రెస్, జేడీఎస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని ప్రయత్నాలు చేస్తోంది.

బెంగళూరులో ఎమ్మెల్యేలు
ఇతర పార్టీల నాయకులు ఎమ్మెల్యేలకు గాలం వెయ్యకుండా బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు సొంత పార్టీల ఎమ్మెల్యేలను బెంగళూరు పిలిపించారు. ఎమ్మెల్యేలతో రిసార్టు రాజకీయాలు చెయ్యడానికి అందరూ సిద్దం అయ్యారు. అయితే బళ్లారికి చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం బెంగళూరు వైపు కన్నెత్తిచూడలేదు.

బళ్లారిలో ప్రత్యక్షం
కంప్లీలో శ్రీరాములు అల్లుడు, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సురేష్ బాబును ఓడించిన జేఎన్. గణేష్ బుధవారం బళ్లారిలో ప్రత్యక్షం అయ్యారు. తన గెలుపుకోసం ప్రముఖ పాత్రపోషించిన మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి కార్యాలయం దగ్గరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జేఎన్. గణేష్ వెళ్లారు.

మీడియాకు దూరం
కంప్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జేఎన్, గణేష్ కు ఆ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ నేరుగా సూర్యనారాయణ రెడ్డి కార్యాలయంలోకి వెళ్లిపోయారు. తరువాత గణేష్ బయటకు రాలేదు.

నరాలు తెగిపోతుంటే హాయిగా !
కాంగ్రెస్, జేడీఎస్ కు చెందిన అనేక మంది ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గణేష్ బళ్లారిలోనే మకాం వెయ్యడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ఇక బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తో ఎమ్మెల్యేలు అయిన ఆనంద్ సింగ్ (విజయనగర), నాగేంద్ర (బళ్లారి గ్రామీణ) అధిష్టానికి అందుబాటులో లేకపోవడం ఆ పార్టీ నాయకులను షాక్ కు గురి చేసింది.

గాలి జనార్దన్ రెడ్డి
విజయనగర ఎమ్మెల్యే ఆనంద్ సింగ్, బళ్లారి గ్రామీణ జిల్లా ఎమ్మెల్యే బి. నాగేంద్ర గతంలో గాలి జనార్దన్ రెడ్డి, బి. శ్రీరాములు ప్రధాన అనుచరులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డి మీద ఉన్న అక్రమ మైనింగ్ కేసుల్లో వీరిద్దరూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి బీజేపీకి తక్కువ సీట్లు ఉన్న సమయంలో వీరిద్దరూ మాయం అయ్యి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications