ఆస్పత్రి నుంచి మమతా బెనర్జీ డిశ్చార్జీ -7రోజులు రెస్టన్నా వినకుండా -బీజేపీ కుట్రంటూ ఈసీకి టీఎంసీ ఫిర్యాదు
అనుమానిత దాడిలో గాయపడి, చికిత్స పొందిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. తాను పోటీ చేస్తోన్న నందిగ్రామ్ లో బుధవారం నామినేషన్ వేసిన తర్వాత దాడి జరిగినట్లుగా మమత చెప్పడం, కాలికి తీవ్రంగా గాయం కావడంతో ఆమెను కోల్కతాలోని ఎస్ఎస్కేహెచ్ ఆసుపత్రికి తరలించడం తెలిసిందే.

వీల్ చైర్లో మమత..
మూడు రోజుల పాటు చికిత్స తీసుకున్న మమత ఆస్పత్రి నుంచి వీల్ చైర్లో బయటకొచ్చారు. అక్కడున్న వారి సాయంతో కారెక్కి తన ఇంటికి వెళ్లారు. నిజానికి మమతకు మరింత చికిత్స అవసరం ఉన్నప్పటికీ.. తనను డిశ్చార్జీ చేయాలని ఆమె పదే పదే కోరారని, ఆమె విజ్ణప్తి మేరకు డిశ్చార్జీ చేయాల్సి వచ్చిందని వారు అన్నారు. రాబోయే వారం రోజులపాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పినా సీఎం వినిపించుకోలేదని, వారం రోజుల తర్వాత మరోసారి పరీక్షలకు ఆసుపత్రికి రావాల్సి ఉందని ఎస్ఎస్కేహెచ్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

బీజేపీపై ఈసీకి టీఎంసీ ఫిర్యాదు
మరోవైపు, మమతా బెనర్జీపై కుట్రపూరితంగానే దాడి జరిగిందని ఆరోపిస్తోన్న టీఎంసీ.. ఈ ఘటనపై మరోసారి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎంపీలు డెరిక్ ఓబ్రెయిన్, సౌగత్ రాయ్, కకోలి ఘోష్, శతాబ్ది రాయ్, ప్రతిమా, శాంతను సేన్ ల బృందం శుక్రవారం ఢిల్లీలోని నిర్వచన్ సదన్ కు వెళ్లి సీఈసీ సునీల్ అరోరాను కలిసింది. నందిగ్రామ్ దాడి ఘటనలో బీజేపీ పాత్రకు సంబంధించిన ఆధారాలను సైతం ఈసీకి సమర్పించామని, దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలని కోరామని టీఎంసీ ఎంపీలు తెలిపారు.

14న టీఎంసీ మేనిఫెస్టో విడుదల
అధినేత్రి మమతా బెనర్జీ గాయపడి ఆస్పత్రిలో చేరడంతో తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల వాయిదా పడింది. ఆదివారం (మార్చి 14న) మమత చేతుల మీదుగానే మేనిఫెస్టో విడుదల ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అసలే బీజేపీ, టీఎంసీ హోరాహోరీగా తలపడుతున్న సమయంలో.. నందిగ్రామ్ లో మమతపై అనుమానిత దాడి ఘటన బెంగాల్ లో ఉద్రిక్తతలను పెంచింది. బెడ్ పై నుంచే వీడియో సందేశమిచ్చిన మమత.. శాంతియుతంగా ఉండాలని, అవసరమైతే వీల్ఛైర్లో కూర్చొని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పడం తెలిసిందే.












Click it and Unblock the Notifications