దీదీ రాజ్యం: మహిళను నగ్నంగా చెట్టుకు కట్టేసి, కొట్టారు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో మరో దారుణ సంఘటన వెలుగు చూసింది. ఈ సంఘటనకుగాను ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. తనను ఓ చెట్టుకు నగ్నంగా కట్టేసి కొట్టారని ఓ మహిళ సోమవారంనాడు ఆరోపించింది. ఈ సంఘటనపై పోలీసులు భార్యాభర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వారు బెయిల్పై విడుదలయ్యారు.
రాష్ట్రంలోని దక్షిణ 24 పరగణాల జిల్లా బరాయిపూర్ సబ్ డివిజన్లోని కుల్తోలీలో ఆదివారంనాడు మహిళపై దౌర్జన్యం జరిగింది. ఆ తర్వాత పోలీసులు సోమవారంనాడు దంపతులను అరెస్టు చేశారు. వారిద్దరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తనపై దొంగతనం నేరం మోపీ, సంజీబ్ మైతి నేతృత్వంలోని ముఠా నగ్నంగా తనను చెట్టుకు కట్టేసి కొట్టారని మహిళ ఆరోపించింది. కర్రలతో కొట్టడమే కాకుండా వేడి ఇనుముతో వాతలు పెట్టారని ఆమె ఆరోపించింది.
మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు సంజీవ్ మైతీని, అతని బార్యను అరెస్టు చేశారు. అయితే, వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసిందని బరాయిపూర్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి దీపక్ సర్కార్ చెప్పారు. దంపతులకు బెయిల్ లభించడంపై ప్రతిపక్షాలు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టాయి. బెయిల్ రావడానికి తృణమూల్ కాంగ్రెసు కార్యకర్తలు సహకరించారని ఆరోపించాయి.
నగ్నంగా మహిళను చెట్టుకు కట్టేసిన తర్వాత అత్యంత దారుణంగా ఆమెపై హింసకు పాల్పడ్డారని, సిపిఎం కార్యకర్త కావడం వల్లనే ఆమెపై దౌర్జన్యం చేశారని, తృణమూల్ కాంగ్రెసు గుండాలు తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, సంఘటనకు ప్రేరేపించినవారందరినీ అరెస్టు చేయాలని మాజీ మంత్రి, సిపిఎం నాయకుడు కాంతి గంగూలీ అన్నారు. మహిళను ఆయన పరామర్శించారు.
సిపిఎం నేత ఆరోపణలను తృణమూల్ కాంగ్రెసు కుల్తోలి బ్లాక్ అధ్యక్షుడు గోపాల్ మాఝీ ఖండించారు. సిపిఎం ఆ డ్రామాను ఆడించిందని, తమపై నిందలు మోపి తమను అప్రతిష్టపాలు చేయడానికి గంగూలీ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు .
రాష్ట్రంలో మహిళలపై దౌర్జన్యాలు పెరగడంపై బిజెపి నేత, నటి రూపా గంగూలీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. అత్యాచారం అనేది చిన్న సంఘటన అని ముఖ్యమంత్రి అనడం వల్ల అటువంటి సంఘటనలు పెరిగిపోతాయని ఆమె అన్నారు. ఇద్దరు నిందితులపై బలహీనమైన కేసులు పెట్టారని కాంగ్రెసు నేత ప్రదీప్ భట్టాచార్య విమర్సించారు.