అసెంబ్లీ సమావేశాలు, ప్రమాణస్వీకారం, విధానసౌధలో ప్రతిపక్ష నాయకుడు ఎవరు ?
బెంగళూరు: కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. 135 ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ ఎవరి మద్దతు అవసరం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నేటి నుంచి రెండు రోజుల పాటు బెంగళూరులోని విధానసౌధలో కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్.వీ. దేశ్ పాండే తాత్కాలిక స్పీకర్ గా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు. కర్ణాటకలో ఎన్నికైన 224 మంది ఎమ్మెల్యేలతో తాత్కాలిక స్పీకర్ ఆర్ వీ. దేశ్ పాండ్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం మొదటి అసెంబ్లీ సమావేశాలు ఇవే.

ఇంతకాలం కర్ణాటకలో అధికారంలో ఉంటూ ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితం అయిన బీజేపీ కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకోవాల్సి ఉంది. అయితే బీజేపీ నాయకులు ఈ విషయంలో డైలమాలో ఉన్నారని తెలిసింది. ఇక జేడీఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి పేరు దాదాపుగా ఖరారు అయ్యిందని తెలిసింది.
కొత్త ఎమ్మెల్యేలు..... 144 సెక్షన్:
2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 135 మంది ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి 66 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు, నలుగురు స్వతంత్ర పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. 2023లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన చాలా మంది కొత్తగా అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.
సోమవారం ఉదయం 11 గంటలకు బెంగళూరులోని విధానసౌధలో కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు మొదలౌతాయి. మే 22వ తేదీ, మే 23వ తేదీన కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. సీఎం సిద్దరామయ్యతో పాటు ఎమ్మెల్యేలు అందరూ శాసన సభ్యులుగా ప్రమాణస్వీకారం చెయ్యనున్నారు.

సిద్దరామయ్య ప్రభుత్వం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టవలసి ఉంది. జులై నెలలో సిద్దరామయ్య బడ్జెట్ ప్రవేశపెడుతారని తెలిసింది. అయితే శనివారం సిద్దరామయ్య అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆ రోజు బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడుతారు అనే విషయంలో క్లారిటీ వస్తుందని కన్నడ మీడియా అంటోంది.
కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్బంగా విధానసౌధ పరిసర ప్రాంతాల్లోని రెండు కిలోమీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరింగింపులు చెయ్యడం నిషేధం అని, ఎవరైనా నియమాలు ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. విధానసౌధ పరిసర ప్రాంతాల్లో పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications