కాంగ్రెస్కు మరో షాక్: బీజేపీలోకి మాజీ మంత్రి అంబరీష్!
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి దూరమైన మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమవగా.. ఇప్పుడు మాజీ మంత్రి, సీనియర్ నటుడు అంబరీష్ కూడా ఆ పార్టీల చేరనున్నట్లు తెలిసింది.
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుందా అంటే అవుననే వాదనలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి దూరమైన మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమవగా.. ఇప్పుడు మాజీ మంత్రి, సీనియర్ నటుడు అంబరీష్ కూడా ఆ పార్టీల చేరనున్నట్లు తెలిసింది.
మంత్రి వర్గం నుంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తప్పించటంతో అలకబూని కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అంబరీష్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంబరీష్ బీజేపీ తీర్థం పుచ్చుకుంటే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టాలని ఆ పార్టీ నాయకులు యోచిస్తున్నారు. దుబాయిలో ఫిబ్రవరి 3న బీజేపీ నాయకులు ఆర్.అశోక్, సతీష్రెడ్డి అంబరీష్ను ఒక హోటల్లో కలుసుకుని గంటకుపైగా చర్చించినట్లు తెలిసింది.
'సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కావాలని మొదటిగా ప్రకటించింది నేనే. ఎన్నికల ముందే ఈ విషయాన్ని ప్రకటించి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాను. మంత్రిగా బాధ్యతల్ని చేపట్టిన తరువాత ఎటువంటి కారణాన్ని చూపించకుండా నన్ను మంత్రి స్థానం నుంచి తప్పించారు. కనీస మర్యాదకు కూడా తనను పరామర్శించలేదు' బీజేపీ నాయకుల వద్ద ముఖ్యమంత్రిపై తనకు ఉన్న తన ఆగ్రహాన్ని ఆయన వ్యక్తం చేసినట్లు సమాచారం.
మాజీ ముఖ్యమంత్రి కృష్ణ కాంగ్రెసు పార్టీను వీడిన తరువాత తన నివాసానికి భోజనానికి వస్తానని సిద్ధరామయ్య తన వ్యక్తిగత సహాయకునితో కబురు పెట్టారని, దాన్ని కూడా తాను తిరస్కరించినట్లు అంబరీష్ వెల్లడించినట్లు తెలిసింది. దుబాయిలో కెంపేగౌడ ఉత్సవాలను విశ్వ ఒక్కలిగర వేదిక ఫిబ్రవరి 3న నిర్వహించింది. ఈ కార్యక్రమం తర్వాత అంబరీష్తో బీజేపీ నాయకులు చర్చల్ని చేయగా, ఎన్నికలకు ఆరు నెలల ముందు బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు అంబరీష్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.