ప్రతిపక్షాల బల ప్రదర్శన- ఐక్య కూటమి ఏర్పాటు, టార్గెట్ బీజేపీ..!!
బీజేపీ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి. త్వరలో జరగునన్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. అధికారమే లక్ష్యంగా రోడ్మ్యాప్ సిద్ధం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మరో కీలక భేటీకి సిద్ధమవుతోంది. సోమ, మంగళవారాల్లో బెంగళూరు నగరంలో విపక్ష పార్టీల మలి భేటీని నిర్వహించనుంది. ఐక్య కూటమి పేరు ఖరారు చేయనున్నారు. లోక్సభ ఎన్నికలకు రోడ్మ్యాప్ ఫిక్స్ చేసే అవకాశం కనిపిస్తోంది.
ప్రతిపక్షాల ఐక్య భేటీ:దేశ రాజకీయాల్లో మరో కీలక భేటీకి బెంగళూరు వేదిక కానుంది. గత నెల 23న బిహార్లో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో 15 పార్టీలు పాల్గొన్నాయి. బెంగళూరులో జరిగే సమావేశంలో పాల్గొననున్న విపక్ష పార్టీల సంఖ్య పెరిగింది. ఈ సమావేశానికి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా హాజరు కానున్నారు.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్వయంగా ఫోన్ చేసి, సోమవారం జరిపే విందుకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. అయితే.. ఆమె తన కాలి గాయం కారణంగా ఆమె నేరుగా సమావేశంలో పాల్గొంటారని తెలుస్తోంది. బిహార్ సమావేశంలో పాల్గొనని ఆర్ఎల్డీ, ఎండీఎంకే, కేడీఎంకే, వీసీకే, ఆర్ఎఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ పార్టీలు బెంగళూరు భేటీకి హాజరవుతాయి.
వరస ర్యాలీలు..కామన్ అజెండా:మొత్తం 24 విపక్ష పార్టీలకు పార్లమెంట్లో 150 మంది ఎంపీలు ఉన్నారు. కూటమికి ప్రత్యేక పేరును నిర్ణయించడంతో పాటు.. భవిష్యత్లో వివిధ రాష్ట్రాల్లో కలిసికట్టుగా ర్యాలీలు నిర్వహించే విషయంపై కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తారు.
కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సహా.. ఆయా విపక్ష పార్టీలకు చెందిన మొత్తం 80 మంది నాయకులు ఈ భేటీల్లో పాల్గొంటారు. ఢిల్లీ ఆర్దినెన్స్ పైన పార్లమెంట్ లో వ్యతిరేకించేందుకు కాంగ్రెస్ ముందుకు వచ్చింది. దీంతో, ఆప్ ఈ సమావేశానికి హాజరు కానుంది. అదే విధంగా శివసేన చీలక తరువాత ఉద్దవ్ థాక్రే ఈ సమావేశానికి హాజరు కానున్నట్లు సమాచారం. బీజేపీ వ్యతిరేక కూటమికి నాయకుడు ఎవరనేది తగిన సమయంలో ప్రకటిస్తామని కూటమి నేతలు చెబుతున్నారు.

ఎన్టీఏ కీలక సమావేశం:ఇటు ప్రతిపక్ష పార్టీల సమావేశం సమయంలోనే అటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సమావేశం కానున్నాయి. 18న ఢిల్లీలో జరిగే సమావేశం కోసం ఇప్పటికే ఉన్న పార్టీలకు అదనంగా కొత్త పార్టీలను ఆహ్వానించారు. ఓబీసీ నేత రాజ్ భర్ ను తమ కూమటిలో చేర్చుకుంది.
దీని ద్వారా ఓబీసీలు..దళితులకు చేరువయ్యే ప్రయత్నాలను బీజేపీ ముమ్మరం చేసింది. అటు బెంగళూరు కేంద్రంగా ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు ధీటుగా తమ కార్యాచరణ సిద్దం చేసేందుకు బీజేపీ నాయకత్వం సిద్దం అవుతోంది. ప్రతిపక్షాల సమావేశంలో దేశవ్యాప్తంగా ఐక్యతను ప్రదర్శిస్తూ ఉమ్మడి పోరాటానికి కార్యాచరణ ప్రకటించేందుకు సిద్దవుతున్నారు. ఈ రెండు రోజులు రానున్న ఎన్నికలకు సంబంధించి కీలక రాజకీయ నిర్ణయాలకు కీలకం కానున్నాయి.












Click it and Unblock the Notifications