ఉబెర్ ఆఫీస్పై ఆర్టీఓ అధికారుల దాడులు: 100 మొబైల్స్ సీజ్
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులోని ఉబెర్ క్యాబ్స్ సేవల సంస్థలో రవాణా శాఖ అధికారులు సోమవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. కంపెనీ అధికారులను ప్రశ్నించిన అధికారులు, కార్యాలయంలోని క్యాబీస్ ఉపయోగించే 100కుపైగా మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
గత వారం ఉబేర్ క్యాబ్స్పై నిషేధించిన నేపథ్యంలో కంపెనీ ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా సర్వీసు అందిస్తున్నట్లు తెలుసుకున్న రవాణా శాఖ అధికారులు కంపెనీ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. మొబైల్ ఫోన్ యాప్ ద్వారా వీరు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. ఉబెర్ కార్యాలయం తెరిచే ఉందని చెప్పారు.
ఉబెర్ క్యాబ్స్ తన కార్యకలాపాలను మళ్లీ కొనసాగించాలంటే లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ముగ్గురు ఉబెర్ ఉద్యోగులు కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్లో విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. వారిని ప్రశ్నించచడంతో పలు విషయాలను తెలిపినట్లు అధికారులు చెప్పారు.
ఉబెర్ లోగో లేకుండా డ్రైవర్లు తమ సొంత వాహనాలను నడుపుకుంటున్నారని ఉద్యోగులు తెలిపారు. ఎలాంటి స్థిర ధర లేకుండా వాహనాలను అద్దెకు నడుపుతున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. కాగా, ఉబెర్ వెబ్సైట్ మూసివేయాలని కార్యాలయం ఉద్యోగులను ఆదేశించినట్లు అధికారులు చెప్పారు.
ఢిల్లీలోని ఉబెర్ క్యాబ్స్కు చెందిన శివకుమార్ అనే డ్రైవర్ ఓ మహిళా ఎగ్జిక్యూటివ్పై అత్యాచారానికి పాల్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. నిషేధం విధించినప్పటికీ కొన్ని నగరాల్లో కార్యకలాపాలు నడుపుతున్న దృష్ట్యా అధికారులు ఉబెర్ కార్యాలయాలపై దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.