పెటా క్యూటెస్ట్ వెజిటేరియన్ కాంటెస్ట్ : ఫైనలిస్టుల్లో కుశాల్ హెబ్బార్
బెంగుళూరు : జంతుసంరక్షణ సంస్థ పెటా (పీపుల్ ఆఫ్ ది ఎథికల్ ట్రీట్ మెంట్ ఆఫ్ ఎనిమల్) 2016 సంవత్సరానికి గాను 'క్యూటెస్ట్ వెజిటేరియన్ కాంటెస్ట్ నెక్ప్ట్ డోర్' తుది పోటీదారుల జాబితాను విడుదల చేసింది. తుది జాబితాలో మొత్తం 20మంది చోటు సంపాదించుకోగా, బెంగుళూరు నుంచి కుశాల్ హెబ్బార్ అనే బిటెక్ విద్యార్థికి చోటు దక్కడం విశేషం.
భౌతిక లక్షణాలు, జంతు సంరక్షణ పట్ల నిబద్దత, వెజిటేరియన్ గా మారడం వెనుక ఉన్న కారణాలు.. ఈ మూడు అంశాలను పరిగణలోకి తీసుకుని 20మందితో తుది పోటీదారుల జాబితాను ప్రకటించింది పెటా ప్యానెల్. ఇక ఈ 20 మంది పోటీదారుల్లో తుది విజేతను నిర్ణయించడం కోసం అక్టోబర్ 28 2016, సాయంత్రం వరకు ఆన్ లైన్ ఓటింగ్ జరగనుంది.
ఓటింగ్ ద్వారా ఎక్కువ మంది మద్దతు చూరగొన్న వాళ్లలో టాప్-2 స్థానాల్లో నిలిచిన వాళ్లను విజేతలుగా ప్రకటిస్తారు. కాగా, తుది విజేతల్లో ఒక అబ్బాయికి, ఒక అమ్మాయికి అవకాశం కల్పిస్తారు. నవంబర్ 1న తుది విజేతలను ప్రకటిస్తారు. కాగా, యువతలో వెజిటేరియన్ ప్రాముఖ్యతపై మరింత అవగాహన పెంచేందుకు గాను జంతు సంరక్షణ సంస్థ అయిన పెటా ఈ పోటీలను నిర్వహిస్తోంది.
క్యూటెస్ట్ వెజిటేరియన్ కాంటెస్ట్ నెక్ప్ట్ డోర్' లో తుది విజేతలుగా నిలిచినవాళ్లకు.. ట్రోఫీ, సర్టిఫికెట్, వెజిటేరియన్ స్టార్టర్ కిట్, గ్లాస్ వాల్స్ డీవీడీలతో పాటుగా సంస్థ దట్టిని కూడా అందజేస్తారు.
ఎవరీ కుశాల్ హెబ్బార్?
కుశాల్ హెబ్బార్ ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్. బీఎన్ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి శాకాహారి అయిన కుశాల్ కు జంతువలంటే ప్రేమ. 'జంతువలంటే నాకు చాలా ప్రేమ, కేవలం రుచి కోసం నాన్ వెజీటేరియన్ గా మారాలని ఎప్పుడు అనుకోలేదు' అని తన అభిప్రాయం వెల్లడించాడు కుశాల్ హెబ్బార్. ప్రస్తుతం పెటా ప్రకటించిన 20మంది తుది వ్యక్తుల జాబితాలో కుశాల్ హెబ్బార్ పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.
'మాంసాహారం తినేవారి కన్నా సగటు వెజిటేరియన్ సన్నగా ఉండడంతో పాటు ఆరోగ్యంగా ఉంటాడు. జీవితాంతం శాకాహారిగా ఉండడం ద్వారా ఎన్నో జంతువులను కబేళాలల్లో బలికాకుండా ఆపవచ్చు' అంటూ పెటా న్యూటిషియనిస్ట్ భువనేశ్వరీ గుప్తా అభిప్రాయపడ్డారు.
'ఎనిమల్ అగ్రికల్చర్ వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని ఐక్యరాజ్య సమితి నిర్దారించింది. పర్యావరణానికి విపరీతమైన హాని కలిగించే మొదటి రెండు మూడు సమస్యల్లో ఇది కూడా ఒకటని ఐరాస ప్రకటించింది. అంతేకాదు జంతువుల నుంచి వచ్చే పాలు, వగైరా వంటి పదార్థాల ద్వారా తయారుచేసే డెయిరీ ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా హ్రుద్రోగాలు, డయాబెటీస్, క్యాన్సర్, ఒబెసిటీ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది' అని పెటా వెల్లడించింది.
నోట్ : ఓటింగ్ లో పాల్గొనదలిచినవారు లోకి ప్రవేశించి సైట్ లో ఉంచిన వివరాలను అనుసరిస్తూ.. నచ్చిన పోటీదారుకు ఓట్ చేయవచ్చు.