బెంగళూరు అల్లరి మూకలపై ఉగ్రవాద చట్టం ప్రయోగం: యూఏపీఏ కింద: ప్రతి పైసా వారి నుంచే
బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరు అల్లర్లపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ దాడులకు పాల్పడిన వారిపై అత్యంత కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక (యూఏపీఏ) చట్టాన్ని ప్రయోగించడానికి సన్నాహాలు చేపట్టింది. సాధారణంగా ఈ చట్టాన్ని ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులపై ప్రయోగిస్తుంటారు. అసాంఘిక కార్యకలాపాలను నిరోధించడానికి ఈ చట్టాన్ని వినియోగిస్తుంటారు.
Recommended Video
అలాంటి కీలకమైన చట్టాన్ని బెంగళూరులో విధ్వంసాన్ని సృష్టించిన అల్లరి మూకలపై ప్రయోగించబోతున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సోమవారం ప్రకటించారు. బెంగళూరులోని కేజీ హళ్లీ, డీజే హళ్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో అల్లరి మూకలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. పులకేశినగర కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి నివాసంపై దాడి చేశారు. ఆయన ఇంటిని తగులబెట్టారు. ఈ ఘటనలో మూడంతస్తుల ఈ భవనం మొత్తం కాలిపోయింది.

పులకేశినగర నియోజకవర్గం పరిధిలోని కావల్ బైరసంద్ర సహా పరిసర ప్రాంతాల్లో కనిపించిన వాహనాన్ని కనిపించనట్టే తగులబెట్టారు. బుగ్గిపాలు చేశారు. అక్కడితో ఆగని అల్లరిమూకలు డీజే హళ్లీ పోలీస్స్టేసన్పైనా దాడులు చేశారు. పోలీసు వాహనాలను కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న 300 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు పోలీసులు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మొదటిసారిగా స్పందించారు. అల్లరిమూకను ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టబోమని హెచ్చరించారు. ఈ విధ్వంసకాండలో నష్టపోయిన ప్రతి రూపాయినీ ఆందోళనకారుల నుంచే వసూలు చేస్తామని ప్రకటించారు. నష్టాన్ని అంచనా వేయడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ హైకోర్టును కోరుతామని అన్నారు. క్లెయిమ్ కమిషనర్ కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు వేస్తామని చెప్పారు.
బెంగళూరులో చోటు చేసుకున్న ఘటనలు ఏ మాత్రం ఉపేక్షించదగ్గవి కావని యడియూర్ప అన్నారు. దీనిపై విచారణ చేపట్టడానికి ఇప్పటికే ఓ ప్రత్యేక దర్యాప్తు కమిటీని నియమించామని అన్నారు. దర్యాప్తు ప్రక్రియను ముమ్మరం చేయడానికి ముగ్గురు ప్రత్యేక ప్రాసిక్యూటర్లను నియమించామని యడియూరప్ప చెప్పారు. గూండా యాక్ట్ను ప్రయోగించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని, దీనిపై సిట్ అధికారుల సిఫారసుల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు.












Click it and Unblock the Notifications