ఫ్లైఓవర్: పిఎంఓకి మూడో తరగతి విద్యార్థి మెయిల్
బెంగళూరు: ఇటీవల పాఠశాల విద్యార్థులే తమ సమస్యలపై పోరాడుతున్నారు. ఈ మధ్యనే తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో ఓ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై అక్కడి విద్యార్థులే హైకోర్టుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. వెంటనే స్పందించిన కోర్టు సమస్యపై దృష్టి సారించింది.
కాగా, తాజాగా బెంగళూరుకు చెందిన 8 సంవత్సరాల అభినవ్ అనే ఓ విద్యార్థి దేశ ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశాడు. బెంగళూరులోని వాయవ్య ప్రాంతంలో చాలాకాలంగా ఓ ఫ్లైఓవర్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో అటుగా రాకపోకలు సాగడం లేదు.
అభినవ్ ఇంటి నుంచి యశ్వంత్పూర్లో ఉన్న పాఠశాలకు 3 కిలోమీటర్ల దూరం. అయినా వెళ్లేందుకు 45 నిమిషాలు పడుతోంది. అక్కడ రైల్వేక్రాసింగ్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వల్లే ఇలా జరుగుతోందని బాలుడికి అర్థమైంది.
దీంతో వెంటనే బెంగళూరు వాయవ్య ప్రాంతంలో ఉన్న ఈ సమస్య గురించి, అక్కడి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రధానమంత్రి కార్యాలయానికి ఒక మెయిల్ పంపాడు.
ఈ ఫ్లై ఓవర్ పనులు ఆగిపోవడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు తన చదువు కూడా దెబ్బతింటోందని అతడు ఆ మెయిల్లో రాశాడు. దీంతో ప్రధానమంత్రి కార్యాలయం వెంటనే రైల్వేశాఖకు ఆ సమస్యను పరిష్కరించాల్సిందిగా సూచించింది.