Bharat Bandh: స్తంభించిన రవాణా: జాతీయ రహదారులు క్లోజ్..రైళ్లు బంద్: పట్టాలపైనే సభలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయదలిచిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ ఉధృతంగా కొనసాగుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో దీని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ దీని తీవ్రత నెలకొని ఉంది. బీజేపీయేతర పార్టీలన్నీ బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో- ఆయా పక్షాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రోడ్లెక్కారు. బంద్లో పాల్గొంటున్నారు.
Angela Merkel: జర్మనీలో రాజకీయంగా ఓ శకం ముగిసినట్టే
జాతీయ రహదారులు దిగ్బంధం
ఉత్తరాది రాష్ట్రాల్లో వేల సంఖ్యలో రైతులు ఈ తెల్లవారు జాము నుంచే రోడ్ల మీద బైఠాయించారు. జాతీయ రహదారులన్నింటినీ అష్ట దిగ్బంధనం చేశారు. గుంపులు గుంపులుగా రోడ్ల మీదికి చేరుకున్నారు. రోడ్ల మీదే నిరసన ప్రదర్శనలు చేపట్టారు. భారతీయ కిసాన్ యూనియన్ నేతృత్వంలో ఈ బంద్ కొనసాగుతోంది. మూడు వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలంటూ బ్యానర్లు, ప్లకార్డులను కిసాన్ యూనియన్ ప్రతినిధులు ప్రదర్శించారు.
బంద్లో రాకేష్ తికాయత్
భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ తికాయత్ ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటల వరకు బంద్ కొనసాగనుండటంతో- అప్పటిదాకా హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్లల్లో పర్యటిస్తారు. ఢిల్లీ-ఘాజీపూర్ బోర్డర్ వద్ద ఆయన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అత్యవసర సర్వీసులను అడ్డుకున్నట్టుగా వస్తోన్న వార్తలను నమ్మొద్దని అన్నారు. తాము బంద్ నుంచి మినహాయింపునిచ్చామని గుర్తు చేశారు. అంబులెన్సులు, డాక్టర్లు, ఇతర అత్యవసర సర్వీసులన్నింటినీ అడ్డుకోవట్లేదని చెప్పారు. సాయంత్రం 4 గంటల వరకు దుకాణదారులు తమ షాపులను మూసివేసి, సహకరించాలని తికాయత్ విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ సరిహద్దులన్నీ మూసివేత..
ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్ నుంచి దేశ రాజధానిలోకి దారి తీసే మార్గాలన్నింటినీ మూసివేశారు. ఢిల్లీ-ఘాజీపూర్ మార్గంలో పెద్ద ఎత్తున బంద్ కొనసాగుతోంది. ఈ సరిహద్దును ఈ సాయంత్రం వరకు మూసివేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఢిల్లీ-అమృత్సర్ జాతీయ రహదారిపైనా పెద్ద ఎత్తున రైతులు బైఠాయించారు. హర్యానాలోని కురుక్షేత్ర వద్ద షాహాబాద్ వద్ద జాతీయ రహదారిని రైతులు దిగ్బంధించారు. ఫలితంగా- ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. బిహార్, ఉత్తర్ ప్రదేశ్లోనూ బంద్ తీవ్రత ఉధృతంగా ఉంది.
శంభు బోర్డర్ వద్దా..
పంజాబ్-హర్యానాలను కలిపే శంభు సరిహద్దు వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ మార్గాన్ని కూడా సాయంత్రం 4 గంటల వరకు మూసి ఉంచనున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. రైతులు శంభు బోర్డర్ వద్ద బైఠాయించారని, ఈ మార్గంలో రాకపోకలు సాగించదలిచిన వారు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచకోవాలని సూచించారు. తెల్లవారు జాము నుంచే పంజాబ్-హర్యానా సరిహద్దుతో పాటు ఈ రెండు రాష్ట్రాల్లో పలు చోట్ల బంద్ వల్ల రవాణా వ్యవస్థ స్తంభించింది.
Recommended Video
పట్టాలపై రైతులు
భారత్ బంద్లో భాగంగా రైతులు వందలాదిగా పట్టాలపై బైఠాయించారు. పంజాబ్లోని బర్నాల రైల్వే స్టేషన్కు చేరుకున్న రైతులు పట్టాలపై కూర్చున్నారు. రైల్వే భద్రతా సిబ్బంది వారిని వారింపజేయడానికి ప్రయత్నించిప్పటికీ ఫలితం లేదు. బర్నాలా, దకౌండ స్టేషన్ల వద్ద వందలాది మంది రైతులు నిరసన ప్రదర్శనలకు దిగారు. పట్టాల మీదే సమావేశం అయ్యారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ నినదించారు. వాటిని ఉపసంహరించుకునేంత వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.