పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పిన భారత్
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో చోటుచేసుకుంటోన్న పరిణామాలపై భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పింది. అక్కడ పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించింది. మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి ప్రపంచం దృష్టి మళ్లించేందుకు ఇలా చేస్తోందని మండిపడింది. ఉగ్రవాదం సహా అనేక విషయాల్లో పాకిస్తాన్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పడరాని పాట్లు పడుతోందని విమర్శించింది.
పీఓకేలోని రావలాకోట్లో జరిగిన హింసాత్మక ఘటనలో 27 మంది మరణించారు. ఇది అధికారిక లెక్క మాత్రమే. పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా పీఓకే భగ్గుమంటోంది. అగ్నిగోళంలా తయారైంది. దాడులు సాగుతున్నాయక్కడ. పోలీసులు జరిపిన కాల్పుల్లో 27 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ తాజా ఆందోళనలకు పిలుపునిచ్చింది. యాక్షన్ కమిటీ సభ్యులపై పాక్ దళాలు దాడులు చేశాయి. నిరసనకారులపై కాల్పులు జరపడం వల్ల పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ఈ నిరసనలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని పలు ప్రాంతాలకు వ్యాపించాయి. మీర్పూర్, ముజఫరాబాద్, గిల్గిత్-బాల్టిస్తాన్లలో ఆందోళనలు తీవ్రంగా ఉన్నాయి. దదియాల్, సుధనోటి, తట్టాపాణిలలో కూడా ప్రజలు రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలను అడ్డుకోవడానికి పాకిస్తాన్ అధికారులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ప్రజలను నియంత్రించేందుకు పాక్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. బ్రిటన్లో కాశ్మీరీ ప్రవాసులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పాకిస్తాన్ మిషన్ కార్యాలయం ముందు వారు ఆందోళన చేపట్టారు.
ఈ పరిణామాలపై భారత్ ఘాటుగా స్పందించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆ దేశం కావాలనే ఫేక్ న్యూస్, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తోందని ఆరోపించింది. పీఓకేలో చోటు చేసుకుంటోన్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ చెప్పారు. పాకిస్థాన్ తీరును ఎండగట్టారు.
పీఓకేలో పోలీసులు, భద్రత బలగాలు అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని, ఆందోళనకారులపై కాల్పులు జరపడం సరికాదని అన్నారు. ఈ కాల్పుల్లో ప్రభుత్వం చెబుతన్న లెక్కల కంటే మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉండొచ్చని చెప్పారు. దీని వెనుక భారత్ ఉందంటూ పాకిస్తాన్ చెబుతూ ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని పేర్కొన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన అక్కడ యథేచ్ఛగా సాగుతోందని, దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు తప్పుడు ప్రచారానికి పాల్పడుతోందని విమర్శించారు.












Click it and Unblock the Notifications