మణిపూర్ లో రెండోరోజు రాహుల్ భారత్ న్యాయ్ యాత్ర- శాంతి,సామరస్యాలు తిరిగి తెస్తామని హామీ..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర రెండోరోజూ మణిపూర్ లో ఉత్సాహంగా సాగింది. రాహుల్ గాంధీ రాక సందర్భంగా స్ధానికులు భారత్ జోడో యాత్రలో భారీగా వచ్చి పాల్గొన్నారు. రాహుల్ కు మద్దతుగా నినాదాలు చేశారు. అశాంతితో అల్లాడుతున్న మణిపూర్ లో రాహుల్ న్యాయ్ యాత్ర ద్వారా ప్రజల్లో భరోసా నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. మణిపూరీలు కోల్పోయిన శాంతి, సామరస్యాల్ని తిరిగి వారికి ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకు మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో ప్రజలు భారీ ఎత్తున రోడ్లపై బారులు తీరారు. రాహుల్ గాంధీ తమ వద్దకు చేరుకోగానే ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు. భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి రాహుల్ కూడా మాట్లాడారు. మణిపూర్ను మరోసారి శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా మారుస్తానని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడైన రాహుల్.. అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు.

మణిపూర్ లో తాను భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రారంభించడం వెనుక ఉద్దేశం దేశానికి బలమైన సందేశం పంపడంతో పాటు మణిపూరీల వ్యధను వారికి అర్ధమయ్యేలా చేయడం అని రాహుల్ గాంధీ తెలిపారు. మణిపూర్ లో తాను చాలా మందిని కలుస్తున్నానని, వారు అనుభవించిన విషాదాన్ని తాను అర్ధం చేసుకోగలనని తెలిపారు. హింసలో కుటుంబాన్ని, ఆస్తుల్ని పొగొట్టుకుంటే ఎలా ఉంటుందో తనకూ అర్దమైందన్నారు. మణిపూర్లో వీలైనంత త్వరగా శాంతి, సామరస్యం తిరిగి రావాలని రాహుల్ ఆకాంక్షించారు.

న్యాయ్ యాత్రలో రాహుల్ త్రివర్ణ జాతీయ పతాకాన్ని చేతుల్లో పట్టుకుని రోడ్లపై తన కోసం వేచి ఉన్న ప్రజలతో మాట్లాడేందుకు తాను ప్రయాణిస్తున్న బస్సు నుండి తరచూ దిగుతూ కనిపించారు. అలాగే అనేక చోట్ల కాలినడకన పాదయాత్ర చేశారు. వందలాది మంది పార్టీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు రాహుల్ యాత్రలో పాల్గొన్నారు. పలువురు వ్యక్తులతో సెల్ఫీలు కూడా దిగారు.












Click it and Unblock the Notifications