దీదీ వర్సెస్ ప్రియాంక : భవానీపూర్ లో బరిలోకి యువమోర్చా నేత: ఏకపక్షమా-హోరా హోరీనా..!!
కోల్కతా: పశ్చిమబెంగాల్ ఉపఎన్నికల్లో హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమయింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పోటీకి బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ లో వరుసగా మూడు సార్లు టీఎంసీని అధికారికంలోకి తెచ్చిన మమతా..ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి ఓడిపోయారు. బీబేపీ నేత సువేందు అధికారిని ఓడించడానికి నందిగ్రామ్ నుంచి పోటీచేశారు. అయితే గట్టిపోటీనిచ్చిన ఆమె 1900ల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.
మమత పైన బీజేపీ అభ్యర్ధి ఖరారు
అయినప్పటికీ ఆ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) అధికారాన్ని చేజిక్కించుకుంది. దీంతో ఆమె ఏ సభకూ ఎన్నిక కాకుండానే మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టారు. కాగా, మమత.. ఆరు నెలల్లోగా శాసనసభకు ఎన్నికకావాల్సిన ఉంది. దీంతో భవానీపూర్ ఎమ్మెల్యేగా ఉన్న రాష్ట్ర వ్యవసాయ మంత్రి సోబన్దేవ్ చటోపాధ్యాయ్.. మమతా బెనర్జి కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో భవానీపూర్తోపాటు మరో రెండు స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను ప్రకటించింది.
న్యాయవాది ప్రియాంక తేబ్రీవాల్
ఈ స్థానాలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 3న ఓట్లను లెక్కిస్తారు. దీంతో..బీజేపీ నుంచి ఎవరు పోటీకి దిగుతారనే ఉత్కంఠ కనిపించింది. తాజాగా బీజేపీ భవానీ పూర్ తో పాటుగా ఉప ఎన్నికలు జరిగే రెండు స్థానాల ఉప ఎన్నికలకు అభ్యర్ధులను అధికారికంగా ప్రకటించింది. భవానీపూర్ నుంచి టీఎంసీ అభ్యర్థినిగా పోటీచేస్తున్న సీఎం మమతాబెనర్జీపై బీజేపీ అభ్యర్థినిగా ప్రియాంక తిబ్రేవాల్ ను కమలనాథులు బరిలోకి దింపుతున్నారు. బీజేపీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతర హింస కేసులో పోరాడుతున్న లాయర్ ప్రియాంక తిబ్రేవాల్ మమతాబెనర్జీపై పోటీకి దింపింది.
హోరా హోరీగానా...ఏకపక్షమా
41 ఏళ్ల ప్రియాంక తిబ్రేవాల్ కోల్ కతా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాది. ఈమె 2014 లో భారతీయ జనతా పార్టీలో చేరింది. ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. 41 ఏళ్ల ప్రియాంక తిబ్రీవాల్ కోల్కతా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింస కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. 2014లో ఎంపీ బాబుల్ సుప్రియో నేతృత్వంలో ఆమె బీజేపీలో చేరారు.
బీజేపీకి ప్రతిష్ఠాత్మకం..మమతకు సునాయాసం
ప్రస్తుతం బీజేపీ యువమోర్చా ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ప్రియాంకను ఎంపీ బాబుల్ సుప్రియో బీజేపీలోకి తీసుకువచ్చారు. అయితే, ఇప్పుడు బీజేపీ తమ అభ్యర్ధిని ప్రకటించటంతో పోరు ఏకపక్షమా లేక హోరా హోరీగా ఉంటుందా అనే చర్చ మొదలైంది. ఇక, ఉప ఎన్నికలు జరగనున్న శంశేర్ గంజ్ కు మిలాన్ ఘోష్, అదే విధంగా జాంగీపూర్ నుంచి సుజిత్ దాస్ ను పార్టీ అభ్యర్ధులుగా ప్రకటించింది. అయితే, ఈ ఉప ఎన్నికలు ఇప్పుుడు బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి.