దారుణం.. భార్యపై అక్రమ సంబంధం అనుమానంతో... చేతులు,పాదాలు నరికేసిన భర్త...
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. భోపాల్లోని నిషత్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అనుమానపు భర్త భార్యపై దారుణానికి తెగబడ్డాడు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఆమె కుడి చేతిని,పాదాన్ని నరికేశాడు. నిందితుడిని ప్రీతమ్ సింగ్ సిసోడియాగా పోలీసులు గుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం... భోపాల్లోని పరాస్ కాలనీలో ప్రీతమ్ సింగ్ సిసోడియా తన కుమారుడితో కలిసి నివసిస్తున్నాడు. అతని భార్య సంగీత ఇండోర్లోని ఓ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేస్తోంది. సెలవు దినాల్లో ఆమె భోపాల్లోని భర్త ప్రీతమ్ వద్దకు వచ్చి వెళ్తుంటుంది. ఇదే క్రమంలో గత మంగళవారం ఆమె భర్తకు వచ్చింది.
ఆరోజు మద్యం సేవించి ఇంటికి వచ్చిన ప్రీతమ్ భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. గొడ్డలితో ఆమె కుడి చేతిని,కుడి పాదాన్ని నరికేశాడు. సంగీత కేకలతో స్థానికులు ఆ ఇంటికి పరిగెత్తారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె చేతిని,పాదాన్ని మళ్లీ అతికించడం సాధ్యం కాదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రీతమ్ సిసోడియాను అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి సమయంలో ఆమె తల కూడా నరికేస్తానని ప్రీతమ్ బెదిరించినట్లు స్థానికులు పోలీసులకు చెప్పారు. తల్లి ఆస్పత్రిలో,తండ్రి పోలీసుల అదుపులో ఉండటంతో ఒంటరైన వారి కుమారుడిని బంధువులకు అప్పగించినట్లు సమాచారం.
కాగా,దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలు రోజురోజుకు పెచ్చరిల్లుతున్నాయి. అత్యాచారాలు,దాడులతో మహిళలకు రక్షణ కరువవుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో మహిళలపై నేరాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. చాలా కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడకపోవడంతో నేరస్తులు బయటకొచ్చి బాధితుల పైనే దాడులకు తెగబడుతున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఓ నిందితుడు బెయిల్పై విడుదలై అత్యాచార బాధితురాలి తండ్రిని గన్తో కాల్చి చంపిన సంగతి తెలిసిందే.