నైస్ అధినేత, ఎమ్మెల్యే అశోక్ ఖేణికి కాంగ్రెస్ తీర్థం: రూ. 2 వేల కోట్ల స్కాం, బీజేపీ ఫైర్ !
బెంగళూరు: కర్ణాటక మక్కల్ పార్టీ వ్యవస్థానకుడు, బీదర్ దక్షిణ శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే, నైస్ సంస్థ యజమాని అశోక్ ఖేణి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నైస్ సంస్థల యజమాని, ఎమ్మెల్యే అశోక్ ఖేణికి అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదే సమయంలో అశోక్ ఖేణి తన కర్ణాటక మక్కల్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.
షరతులు వర్తించవు
కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర్ మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేకుండా ఎమ్మెల్యే అశోక్ ఖేణి కాంగ్రెస్ పార్టీలో చేరారని, మా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంపై నమ్మకంతోనే అశోక్ ఖేణి కర్ణాటక మక్కల్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారని అన్నారు.
పార్టీ మాత్రమే, నైస్ సంస్థ కాదు
ఎమ్మెల్యే అశోక్ ఖేణిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నామని, కర్ణాటక మక్కల్ పార్టీని విలీనం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంగీకరించిందని కర్ణాటక రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ అన్నారు. అంతే కాని నైస్ సంస్థను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోలేదని మంత్రి డీకే. శివకుమార్ వివరణ ఇచ్చారు.
రూ. 2 వేల కోట్ల స్కాం !
నైస్ కంపెనీ బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ల అభివృద్ది ముసుగులో అశోక్ ఖేణి రైతుల దగ్గర అతి తక్కువ ధరకు భూములు స్వాధీనం చేసుకుని తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడని, నైస్ సంస్థ దాదాపు రూ. 2 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడని అప్పట్లో స్వయంగా సిద్దరామయ్య, మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ తదితరులు ఆరోపించారు.
ఎన్నికల ఖర్చు కోసం అశోక్ ఖేణి
శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఖర్చుల కోసం అశోక్ ఖేణిని పార్టీలో చేర్చుకున్నారని కర్ణాటక మాజీ ఉప మంత్రి ఆర్. అశోక్, మాజీ మంత్రి సురేష్ కుమార్ (ఇద్దరూ బీజేపీ) ఆరోపించారు.
సిగ్గులేదా, మాజీ ప్రధాని
అమాయకులైన రైతుల భూములు స్వాధీనం చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కర్ణాటకకు ద్రోహం చేసిన అశోక్ ఖేణిని ఎలా పార్టీలో చేర్చుకుంటారని. కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గుండాలని మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ మండిపడ్డారు.