కరోనా లాక్డౌన్ 4.o: భారీ సడలింపులు, ఇక రాష్ట్రాలకే ఆ అధికారం
న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ 4.0లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా హాట్ స్పాట్లును నిర్ణయించే అధికారాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం బదిలీ చేయనుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.
Recommended Video

సడలింపులు ఇలా..
రైల్వే, దేశీయ విమాన ప్రయాణాలు దశల వారీగా ప్రారంభమయ్యే అవకాశం ఉండగా.. కళాశాలలు, పాఠశాలలు, మాల్స్, సినిమా హాళ్లకు మాత్రం అనుమతి ఉండదు. కరోనా కంటైన్మెంట్ జోన్లను మినహాయించి రెడ్ జోన్లలో క్షౌరశాలలు, సెలూన్లు, కళ్లద్దాల దుకాణాలకు అనుమతిస్తారు. ఇక గ్రీన్ జోన్లలో పూర్తిగా కార్యకలాపాలను ప్రారంభించవచ్చు. ఆరెంజ్ జోన్లలో మాత్రం పరిమితి ఆంక్షలు ఉంటాయి. ఇక రెడ్ జోన్, కంటైన్మెంట్ ప్రాంతాల్లో మాత్రం కఠిన నిబంధనలు అమలు కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు పంపించాక పూర్తి మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ జారీ చేయనుంది. శుక్రవారం లోపు రాష్ట్రాలు సూచనలు ఇవ్వాల్సి ఉంది.

రాష్ట్రాలకే ఇక ఆ అధికారం..
కాగా, పశ్చిమబెంగాల్, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం, తెలంగాణ రాష్ట్రాలు లాక్డౌన్ కొనసాగించాలని కోరిన విషయం తెలిసిందే. కరోనా పరిస్థితుల ఆధారంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జిల్లాలను నిర్ణయించే అధికారం ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్రాలు కోరినట్లు అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా ప్రజల కదలికలకు అనుమతి, నిరాకరణ అధికారాన్ని రాష్ట్రాలకు బదిలి చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందని అధికారులు తెలిపారు.

లాక్డౌన్ కోరుకోవడం లేదు కానీ..
దేశంలోని ఏ రాష్ట్రమూ కూడా పూర్తి లాక్డౌన్ అమలు చేసేందుకు సుముఖంగా లేదని, దశలవారీగా ఆర్థిక కార్యకలాపాల్ని పునరుద్దరించాలని కోరుకుంటున్నాయని అధికారులు తెలిపారు. రైల్వే, దేశీయ విమాన ప్రయాణాలకు పరిమితంగా అనుమతిస్తారని చెప్పారు. మే చివరి వరకు కూడా ఈ సేవలను అనుమతించేందుకు బీహార్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు సిద్ధంగా లేవని తెలిపారు. కఠిన ఆంక్షల మధ్య పరిమిత సామర్థ్యంతో మెట్రో, స్థానిక రైళ్లను అనుమతిస్తారని తెలుస్తోంది. రెడ్ జోన్లలో ఆటో, రిక్షాలకు అనుమతించే అవకాశం ఉందని తెలిపారు.

సడలింపులతోనే లాక్డౌన్ అమలు..
కంటైన్మెంట్ జోన్లు లేని ప్రాంతాల్లో చాలా సేవలకు అనుమతిస్తారని, అయితే రాష్ట్ర ప్రభుత్వాలే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. రెడ్ జోన్లలో మార్కెట్లను తెరిచే అధికారాలు కూడా రాష్ట్రాలకే ఇస్తారని తెలుస్తోంది. అత్యవసరం కాని వస్తువులు విక్రయించే దుకాణాలు తెరిచేందుకు సరి-బేసి విధానాన్ని అమలు చేయొచ్చని సూచించారు. ఈ-కామర్స్ సంస్థలు డెలివరీ చేసేందుకు పూర్తిగా అనుమతిస్తారని తెలుస్తోంది. దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ను సడలింపులతో అమలు చేసేందుకు సుముఖంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. కాగా, మే 17 తర్వాత కేంద్రం మరోసారి లాక్ డౌన్ పొడగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే, సడలింపులతోనే ఈ లాక్ డౌన్ కొనసాగనుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications