OTT యూజర్లకు కేంద్రం భారీ షాక్- ఇక ప్రకటనలు ఇక్కడా భరించాల్సిందే..!
కరోనా తర్వాత దేశవ్యాప్తంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సందడి పెరుగుతోంది. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ సంస్ధలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అలాగే ఇప్పటికే అందుబాటులో ఉన్న అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ మధ్య తీవ్ర పోటీ కూడా నెలకొంది. ఈ తరుణంలో మార్కెట్లో తమ పోటీ దారుల కంటే ఓ అడుగు ముందు ఉండేందుకు ఆయా సంస్ధలు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో అందరికీ కలిపి కేంద్రం తాజాగా ఓ షాకిచ్చింది.
ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తో పాటు వాటిని వాడుతున్న యూజర్లకు కలిపి కేంద్రం తాజాగా ఓ షాకిచ్చింది. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా రూల్స్ ప్రకారం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో పెడుతున్న కంటెంట్ లోనూ థియేటర్ల తరహాలో పొగాకు వ్యతిరేక హెచ్చరికలతో కూడిన యాడ్స్ ను ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు కూడా ఈ మేరకు కొత్త నిబంధనలతో కూడిన ఉత్తర్వులు పంపింది. వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఇప్పటివరకూ సినిమా థియేటర్లలో, మల్టీప్లెక్స్ లో సినిమా ప్రదర్శకు ముందు, మధ్యలో కూడా పొగాకు వాడకం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ హెచ్చరికల ప్రకటనలు ఇవ్వాలనే ఆదేశాలు ఉన్నాయి. ఇప్పుడు కేంద్రం తాజా రూల్స్ ప్రకారం ఓటీటీలకు కూడా ఇవే నిబంధనలు వర్తింపచేస్తారు. ప్రోగ్రాం సమయంలో పొగాకు ఉత్పత్తులు, వాటి వినియోగాన్ని చూపిస్తున్నప్పుడు కింద హెచ్చరికతో కూడిన మెసేజ్ తప్పనిసరిగా ఇవ్వాలి. ఓటీటీ ప్లాట్ఫారమ్లకు పెరుగుతున్న ప్రజాదరణ నేపథ్యంలో, ముఖ్యంగా మైనర్ల మనస్సును ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
పొగాకు వాడకం వల్ల వచ్చే అనర్ధాలతో పాటు మరణాల్ని దృష్టిలో ఉంచుకుని పొగాకు వినియోగాన్ని నిరుత్సాహపరిచేందుకు ప్రభుత్వం సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల ప్రకటనల నిషేధం, వాణిజ్యం, ఉత్పత్తి, సరఫరా, పంపిణీ నియంత్రణ నిబంధనలు 2004ను (COTPA)ని అమలులోకి తెచ్చింది. వీటి ప్రకారం ఈ హెచ్చరికలకు ప్రచారం కల్పించడం ద్వారా పొగాకు వాడకాన్ని కాస్తయినా నియంత్రించవచ్చని కేంద్రం భావిస్తోంది.












Click it and Unblock the Notifications