తొలి కరోనా ఎన్నికల్లోనూ ఎన్డీఏ హవా - నితీశ్ నాయకత్వానికే బీహారీల పట్టం - ఒపీనియన్ పోల్ ఫలితాలివే..
కరోనా విలయకాలంలో జరుగుతోన్న తొలి రాజకీయ సమరంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు చరిత్రకెక్కనున్నాయి. కొవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో 60 ఏళ్లు పైబడిన ఓటర్లందరికీ పోస్టల్ బ్యాలెట్ అనుమతించడం మొదలుకొని ఈ ఎన్నికల్లో ఎన్నెన్నో కొత్త విధానాలు అమలుకానున్నాయి. కాగా, చెప్పాపెట్టకుండా లాక్ డౌన్ విధించి, కోట్ల మంది వలసదారుల్ని.. ప్రధానంగా బీహారీ వలస కూలీలను ఇబ్బందులకు గురిచేశారంటూ ఎన్డీఏ సర్కారుపై విమర్శలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతుండగా.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆ ప్రభావం మచ్చుకైనా ఉండబోదని వెల్లడైంది.
Recommended Video

ఏబీపీ-సీఓటర్ సర్వే..
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రముఖ వార్తా సంస్థ ఏబీపీ న్యూస్, ప్రఖ్యాత సర్వే సంస్థ ‘సీఓటర్' సంయుక్తంగా నిర్వహించిన ఒపీనియన్ పోల్ ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. తొలి కరోనా ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ బంపర్ మెజార్టీతో గెలుస్తుందని, రాష్ట్రం నలుమూలలా బీజేపీ-జేడీయూ హవా కనిపించనుందని ఏబీపీ-సీఓటర్ సర్వేలో తేలింది. ఒపీనియన్ పోల్స్ అంచనాల్లో తేలింది. సర్వే కోసం 25,789 శాంపిళ్లను సేకరించామని ఏబీపీ-సీఓటర్ తెలిపాయి. ఇక ఓట్లు, సీట్ల విషయానికొస్తే..
హేమంత్ హత్య కేసులో ట్విస్ట్ - రూ.10లక్షల సుపారి - కారులోనే అంతం చేశారు - అవంతి ఫ్యామిలీ అరెస్ట్

ఎన్డీఏ వైపే ఓటర్ల మొగ్గు..
మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి చివరిగా 2015లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు నితీశ్ కుమార్ జేడీయూ(80 సీట్లు), లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ(71 సీట్లు), కాంగ్రెస్(27సీట్లు) మహాకూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించాయి. ఎన్డీఏ కూటమిలో బీజేపీకి 53, ఎల్జేపీ 2, హెచ్ఏఎంకు ఒక సీటు రాగా, ఇతర పార్టీలు 10 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఏడాది తిరిగేలోపే నితీశ్.. లాలూకు హ్యాండిచ్చి, బీజేపీతో కలిసిపోవడంతో మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చినట్లైంది. లాలూకు చేసిన ద్రోహానికి నితీశ్ కు ఎదురుదెబ్బ తప్పదన్న అంచనాలను తలకిందులు చేస్తూ, 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ వైపే ఓటర్లు మొగ్గు చూపుతున్నారని, ఎన్డీఏ 45 శాతం ఓట్లతో 141 నుంచి 161 సీట్లు సాధిస్తుందని ఏబీపీ-సీఓటర్ అంచనా వేసింది.

నితీశ్ నాయకత్వానికే జేజేలు
ఏబీపీ-సీఓటర్ ఒపీనియన్ పోల్ అంచనా ప్రకారం.. ఎన్డీఏకు గత ఎన్నికల కంటే 10.7 శాతం ఓటింగ్ పెరిగి, సుమారు 45 శాతం ఓట్లు, 141 నుంచి 161 సీట్లు వస్తాయని, అదే సమయంలో యూపీఏ కూటమి(ఆర్జేడీ-కాంగ్రెస్) 33.45 శాతం ఓట్లతో 64 నుంచి 84 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, ఇతర పార్టీలన్నీ కలిసి 22 శాతం ఓటింగ్ తో 13 నుంచి 23 సీట్లు సాధించొచ్చని వెల్లడైంది. ముఖ్యమంత్రి స్థానానికి ఇతరులెవ్వరూ పోటీ ఇవ్వలేని పరిస్థితుల్లో బీహారీలంతా నితీశ్ కుమార్ నాయకత్వంపైనే విశ్వాసం ఉంచినట్లు తెలుస్తోంది.

ఆయన అప్రూవల్ రేటు ఎంతంటే..
బీహార్ ముఖ్యమంత్రిగా ఎవరుండాలన్న ప్రశ్నకు ఒపీనియన్ పోల్ లో కచ్చితమైన సమాధానం వచ్చిందని సర్వేయర్లు పేర్కొన్నారు. సీఎం అభ్యర్థిగా నితీశ్ కుమార్ అప్రూవల్ రేటు 31 శాతంగా ఉందని, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను సీఎంగా కోరుతోన్న వాళ్లు కేవలం 8 శాతం మందేనని, లాలూ తనయుడు, ప్రస్తుత ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ సీఎం అయితే బాగుంటుందని 15 శాతం మంది అభిప్రాయపడినట్లు ఏబీపీ-సీఓటర్ తెలిపింది. రీజియన్ల వారీగా చూస్తే గతంలో అటు ఇటుగా ఉన్నవికాస్తా, ఈసారి ఎన్డీఏకే అనుకూలంగా ఉన్నాయని తూర్పు బీహార్ రీజియన్ లో ఎన్డీఏకు 14 నుంచి 18 సీట్లు, మగథ్ భోజ్ పురి రీజియన్ లో 39 నుంచి 43 సీట్లు, మిథిలాంచల్ లో 27 నుంచి 31 సీట్లు, సీమాంచల్ రీజియన్ లో 14 నుంచి 18 సీట్ల వస్తాయని ఏబీపీ-సీఓటర్ అంచనా వేసింది.

కరోనా ఎన్నికల్లో కొత్త కొత్తగా..
బీహార్ అసెంబ్లీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 28న తొలి దశలో 16 జిల్లాల్లోని 71 నియోజకవర్గాల్లో, నవంబర్ 3న రెండో దశలో 17 జిల్లాల్లోని 94 నియోజకవర్గాల్లో, నవంబర్ 7న మూడో దశలో 15 జిల్లాల్లో 78 నియోజవకర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తామని, నవంబరు 10న ఫలితాలను ప్రకటిస్తామని ఈసీ తెలిపింది. కరోనా నేపథ్యంలో ఇంటింటి ప్రచారాన్ని రద్దు చేశారు, అభ్యర్థులు ఆన్ లైన్ లోనే నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది, పోలింగ్ కేంద్రాల్లో థర్మల్ స్కానర్లు, మాస్కులు తప్పనిసరి, సోషల్ డిస్టెన్సింగ్ కారణంగా పోలింగ్ సమయం గంట పెంపు, 60ఏళ్లు పైబడిన వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం.. ఇలా కొత్త అంశాలెన్నో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చోటుచేసుకోనున్నాయి.












Click it and Unblock the Notifications