3 సార్లు సీఎం..అడుక్కునే స్థితిలో కుటుంబం.. భోలా శాస్త్రి ఫ్యామిలీ దీనగాథ.. లాక్ డౌన్ లో తిండి లేక..
రాజకీయాలు బాగా ఖరీదైపోయిన ప్రస్తుత తరుణంలో.. ఓ రాజకీయ నేత వారసులు.. అందునా మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కుటుంబీకులు ఆకలితో అలమటిస్తున్నారంటే నమ్మడం కొద్దిగా కష్టమే. కానీ ఇది నూరుశాతం నిజం. బతికినంతకాలం ఆ పెద్దాయన నిజాయితీ తప్ప మరో మాట ఎరుగడు.. వచ్చిన జీతాన్నీ నలుగురికీ పంచేవాడు. కనీసం సెంటు భూమి కూడా లేకపోవడంతో ఇప్పుడాయన వారసులు కూలీనాలి చేసుకుంటూ కడుపేదరికంలో జీవిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా చేతిలో పనిలేక.. తినడానికి తిండి లేక అడుక్కునే స్థితికి చేరుకున్నారు..
మూడు సార్లు సీఎం..
ప్రతి ఏటా సెప్టెంబర్ 21 బీహార్ ప్రభుత్వం ‘భోలా పాశ్వాన్ శాస్త్రి' జయంతి వేడుకల్ని నిర్వహిస్తుంటుంది. పేరుకు పక్కా కాంగ్రెస్ వాది అనిప్పటికీ.. పార్టీలకు అతీతంగా చిన్నాచితకా నేతలు ఆయన పేరుమీద పలు కార్యక్రమాలు జరుపుతుంటారు. ఆ హడావుడిలో ఆయన ఫ్యామిలీని మాత్రం ఎవరూ పట్టించుకునేవాళ్లుకాదు. 1968 నుంచి 1972 మధ్య కాలంలో(మొత్తం 11 నెలలపాటు) భోలా పాశ్వాన్ శాస్త్రి.. బీహార్ కు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో సైతం పాల్గొన్న ఈ తొలితరం దళితనేత అపార మేధావి కూడా. ఆయన మేథోశక్తిని కీర్తిస్తూ పేరు పక్కన ‘శాస్త్రి'అని తగిలించారు అప్పటి నేతలు. రాజ్యసభ సభ్యుడిగానూ ఆయన సేవలందించారు. కాలక్రమంలో శాస్త్రిగారి వారసులనే పేరుతప్ప ఆ కుటుంబానికి దక్కిన ప్రివిలేజెస్ శూన్యం.
లాక్ డౌన్ తో మరీ ఘోరం..
బీహార్ మాజీ సీఎం భోలా పాశ్వాన్ దంపతులకు పిల్లలు లేరు. దీంతో మేనల్లుణ్ని(అక్క కొడుకు) దత్తత తీసుకుని బిరంచి పాశ్వాన్ అని పేరుపెట్టుకున్నాడు. ఆరో తరగతిలోనే బడి మానేసిన బిరంచి.. భోలాకు అన్ని విధాలుగా సేవలు చేస్తూ గడిపాడు. 1984లో పెద్దాయన కన్నుమూసే సమయానికి.. సొంత ఊరు బైర్గచిలో ఓ ఇల్లు, పూర్నియా జిల్లా కేంద్రంలో మరో ఇల్లు తప్ప ఆ ఫ్యామిలీకి ఆస్తులేవీ లేకుండే. భోలా చనిపోయిన కొద్ది రోజులకే అవసరాల కోసం పూర్నియాలోని ఇంటిని అమ్మేసి.. ఫ్యామిలీ మొత్తం బైర్గచి గ్రామంలోనే స్థిరపడిపోయింది. కూలీ పనులు చేసుకునే తాము లాక్ డౌన్ వల్ల ఇంకాస్త దెబ్బతిన్నామని, ఆకలితో చావలేక.. ఊళ్లో భూస్వాముల దగ్గర్నుంచి ఐదు వేలు అప్పుగా అడుక్కున్నామని బిరంచి పాశ్వాన్ చెప్పారు.
రేషన్ కార్డు ఉన్నా..
మాజీ సీఎం భోలా వారసుడైన బిరంచి పాశ్వాన్ కు ప్రస్తుతం 70 ఏళ్లు. కానీ ఆధార్ కార్డులో మాత్రం 52ఏళ్లేనని ఉండటంతో వృద్ధాప్య పెన్షన్ పొందేందుకు నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. ముగ్గురు కొడుకులు, వాళ్ల పిల్లల్ని కలుపుకొని ఉమ్మడి ఫ్యామిలీలో మొత్తం 26 మంది ఉండగా.. రేషన్ సరుకులు మాత్రం 12 మందికే అందుతున్నాయి. దురదృష్టవశాత్తూ ఆధార్ కార్డులో వయసు తప్పుగా పడినట్లే.. రేషన్ కార్డులోనూ కుటుంబీకుల సంఖ్య 12గా నమోదైందని, దొరికే కొద్దోగొప్పో సరుకులతో అర్థాకలితోనే జీవిస్తున్నామని బిరంచి తెలిపారు. రేషన్ కార్డులో అందరి పేర్లు చేర్పించేందుకు కొన్నేళ్లుగా తంటాలు పడుతున్నాని, ఆఫీసుల చుట్టూ తిరగలేక చివరికి ప్రయత్నం కూడా విరమించుకున్నానని, ఈ మధ్యే ఓ మహిళా సంఘం వాళ్లొచ్చి, పేర్లు రాసుకుని వెళ్లారని చెప్పుకొచ్చారు.
జయంతి ఖర్చుల్లో కొంతైనా..
‘‘ఏటా సెప్టెంబర్ 21న మా తండ్రి జయంతిని బీహార్ ప్రభుత్వం నిర్వహిస్తుంటుంది. అందుకు అయ్యే ఖర్చులో కొంత మొత్తాన్నయినా మాకు అందజేస్తే బాగుండేదని చాలా సార్లు అనిపించింది. కానీ ఎవరినీ అడగలేదు. పెద్దాయన బతికున్నరోజుల్లో ఓసారి.. ఊరికి రోడ్డు వేయించాలని కోరాను. అందుకాయన.. సొంత పనులు చేసుకుంటే జనం వేలెత్తి చూపుతారని బదులిచ్చారు. పేదరికంలోనే రోజులు అలా గడుస్తున్నా.. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా అన్నీ కోల్పోయాం. లాక్ డౌన్ ప్రకటించే ముందు మాలాంటి పేదకూలీల గురించి ప్రభుత్వాలు ఆలోచించి ఉంటే ఈ పరిస్థితి రాకపోయేది''అని బిరంచి ఆవేదన వ్యక్తం చేశారు.
Recommended Video
స్పందించిన నేతలు..
బిరంచి పాశ్వాన్ కుటుంబం దీనగాథపై ప్రఖ్యాత టెలిగ్రాఫ్ పత్రిక ఇటీవల కథనాన్ని ప్రచురించింది. అది చూసి చాలా మంది బీహారీ నేతలు స్పందించారు. ముందుగా, ప్రతిపక్ష ఆర్జేడీ నేత, లాలూ చిన్నకొడుకు తేజస్వీ యాదవ్.. తన పార్టీ నేతల్ని బిరంచి ఇంటికి పంపించి, రేషన్ సరుకులు, రూ.1లక్ష నగదును అందించారు. కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు, ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ సైతం మాజీ సీఎం ఫ్యామిలీకి రూ.1.11లక్షల చెక్కును పంపారు. పలు దళిత సంఘాలు, నేతలు కూడా తమ వంతుగా విరాళాలు సేకరించేప్రయత్నం చేస్తున్నారు. పేదరికంలో మగ్గుతోన్న తమను నేతలు ఆదుకోవడంపై ఆనందం వ్యక్తం చేసినప్పటికీ.. ‘‘ఈ రూ.2.11లక్షలతో ఎన్నాళ్లు గడుపుతాం? ప్రభుత్వమే పెద్ద మనుసుతో మా కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నా''అని బిరంచి పాశ్వాన్ మీడియాతో అన్నారు.