"భారత ఆర్థిక వ్యవస్థ 20 ఏళ్లు వెనక్కి..??"
ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్- అమెరికా యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్య రవాణాకు గుండెకాయ అయిన హార్మూజ్ జలసంధి మూతబడింది. దాంతో ప్రపంచ దేశాలు ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోయాయి. పశ్చిమాసియా సెగలు ప్రపంచ దేశాలతోపాటు భారత్ నూ తాకాయి. భారత్ లోనూ సంక్షోభ పరిస్థితులు ఎదురవుతున్నాయి. భారత్ చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో 60 నుంచి 65 శాతం వరకు చమురు హార్మూజ్ జలసంధి ద్వారానే మన దేశానికి చేరుతుంది. ఈ వాణిజ్య మార్గం మూసివేసిన నేపథ్యంలో భారత్ లో పెట్రోల్, డీజిల్ సంక్షోభం తలెత్తింది.
ఇప్పటికే వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. అలాగే గ్యాస్ డెలివరీ, బుకింగ్ రూల్స్ లో మార్పులు వచ్చాయి. ఇటీవల ప్రధాని మోదీ మాట్లాడుతూ.. విదేశీ మారక ద్రవ్యం నిల్వలను కాపాడుకోవడానికి ఇంధనాన్ని ఆదా చేయాలని కోరారు. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలన్నారు. సంవత్సరం పాటు బంగారం కొనుగోలు చేయొద్దని తెలిపారు. ఏడాదిపాటు విదేశీ ప్రయాణాలు మానుకోవాలన్నారు. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచనలు చేశారు.
అయితే ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఆరో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా ఉంది. రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో జర్మనీ, నాలుగో స్థానంలో జపాన్ అలాగే ఐదో స్థానంలో బ్రిటన్ ఉంది. అయితే తాజాగా చైనాకు చెందిన ఉన్నతాధికారి భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోబలైజేషన్ వైస్ ప్రెసిడెంట్ విక్టర్ జికై గావో ఓ ఇంటర్వూలో భారత్- చైనా సంబంధాలపై మాట్లాడారు. ఆర్థికంగా చైనా కంటే భారత్ 20 ఏళ్లు వెనక ఉంది అన్నారు.
1978 లో చైనా- భారత్ ఆర్థిక వ్యవస్థలు దాదాపు ఒకే స్థాయిలో ఉండేవని ఆయన గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ భారత్ కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఆర్థిక అభివృద్ధి, సైన్స్, సాంకేతిక రంగాల్లో భారత్ కంటే చైనా కనీసం 20 నుంచి 30 ఏళ్లు వెనుకబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

చైనా తన సైనిక ఆయుధాలను సొంతంగా తయారు చేసుకునే పారిశ్రామిక, సాంకేతిక, సామర్థ్యాన్ని కలిగి ఉందని ఆయన స్పష్టం చేశారు. అంతేకాక భారత్ ఎప్పటికీ సొంతంగా తమ ఆయుధాలను తయారు చేసుకోలేదని తీవ్ర విమర్శలు చేశారు. ఇక చైనా- భారత్ మధ్య ఉన్న మెక్ మోహన్ లైన్ చట్టవిరుద్ధమైనదని పేర్కొన్నారు. సరిహద్దు వివాదం కారణంగా చైనాతో భారత్ ఆర్థిక సంబంధాలను దూరం చేసుకుంటే అది భారత్ కే నష్టం అని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications