మళ్లీ లాక్డౌన్ రాబోతుందా? క్లిక్ చేస్తే అంతే సంగతులు!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అస్థిరత, భయాందోళనలు పెరుగుతున్నాయి. ఓ వైపు హంటా, ఎబోలా వంటి ప్రాణాంతక వైరస్ల గురించిన వార్తలు.. మరోవైపు ఇరాన్-అమెరికా దేశాల మధ్య ముదురుతున్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లు కుదేలవుతుండటంతో పాటు చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. చమురును ఆదా చేయాలని, పెట్రోల్-డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు వీలైనంత వరకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' సంస్కృతిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అయితే ప్రధాని మోదీ చేసిన ఈ కామెంట్లను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని సరికొత్త మోసాలకు తెరలేపారు.
ప్రధాని ప్రసంగం ముగిసిన వెంటనే సోషల్ మీడియా, వాట్సాప్లో 'లాక్డౌన్ నోటీస్' పేరుతో కొన్ని నకిలీ పీడీఎఫ్ ఫైళ్లు, నకిలీ ప్రభుత్వ ఆదేశాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దేశంలో మళ్లీ లాక్డౌన్ విధించబోతున్నారనే భయాన్ని ప్రజల్లో కల్పిస్తూ సైబర్ కేటుగాళ్లు వల విసురుతున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్స్లో "WAR LOCKDOWN NOTICE.pdf" లేదా "Emergency Lockdown Order" అనే పేర్లతో ఫైళ్లను పంపుతున్నారు. ఇవి చూడటానికి నకిలీవైనా.. వాటిపై అశోక చక్రం, ప్రభుత్వ అధికారిక ముద్రలు, ప్రభుత్వ భాషను వాడుతుండటంతో సామాన్య ప్రజలు ఇవి నిజమైన నోటీసులేనని నమ్మి మోసపోతున్నారు.

ఈ నకిలీ పీడీఎఫ్ ఫైళ్లు లేదా వాటిలో ఉండే లింకుల వెనుక అత్యంత ప్రమాదకరమైన మాల్వేర్, ఫిషింగ్ లింకులు దాగి ఉంటాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వినియోగదారులు ఆతృతతో లేదా భయంతో ఆ పీడీఎఫ్ ఫైల్ను డౌన్లోడ్ చేసినా లేదా అందులోని లింక్లపై క్లిక్ చేసినా వారి మొబైల్ ఫోన్లు హ్యాకర్ల ఆధీనంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ఈ లింకులు వినియోగదారులను నకిలీ ప్రభుత్వ వెబ్సైట్లలోకి తీసుకెళ్లి అక్కడ వారి బ్యాంక్ వివరాలు, ఓటీపీ లేదా వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నాయి. ఫలితంగా క్షణాల వ్యవధిలో బాధితుల బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయి.
గతంలో సైబర్ నేరగాళ్లు కేవలం ఫేక్ సందేశాల(SMS) ద్వారా మాత్రమే మోసాలకు పాల్పడేవారు. కానీ ఇప్పుడు ప్రజల భయాలను, భావోద్వేగాలను పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. కరోనా కాలం నాటి లాక్డౌన్ చేదు జ్ఞాపకాలు ప్రజల మనస్సుల్లో ఇంకా బలంగా ఉండటంతో మళ్లీ లాక్డౌన్ రాబోతుందనే మెసేజ్ చూడగానే జనం భయాందోళనకు గురై ఆ ఫైళ్లను ఓపెన్ చేస్తున్నారు. పాత మొబైల్ ఫోన్లు వాడేవారికిస, సెక్యూరిటీ అప్డేట్స్ లేని ఫోన్లకు ఈ వైరస్ ఫైళ్ల వల్ల ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఫోన్ డేటా చోరీకి గురవ్వడం, వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అవ్వడం లేదా డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులకు పాల్పడటం వంటివి జరుగుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. వాట్సాప్లో వచ్చే ఎలాంటి లాక్డౌన్ నోటీస్ పీడీఎఫ్లను కూడా నమ్మవద్దని, వాటిని డౌన్లోడ్ చేయడంగానీ, ఇతరులకు ఫార్వార్డ్ చేయడంగానీ చేయకూడదని స్పష్టం చేస్తున్నారు. ఏదైనా ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులను తెలుసుకోవాలంటే ఎల్లప్పుడూ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లను లేదా నమ్మకమైన వార్తా సంస్థలను మాత్రమే పరిశీలించాలి. ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో వైరస్లు, యుద్ధాల కంటే.. నకిలీ వార్తలు, డిజిటల్ భయాల ద్వారా జరుగుతున్న సైబర్ దోపిడీలే అత్యంత ప్రమాదకరంగా మారాయని గుర్తుంచుకోవాలి.












Click it and Unblock the Notifications