ఫ్రీ కరోనా వ్యాక్సిన్ గాలానికి పడని బిహారీయులు: జేడీయూ-బీజేపీకి దక్కని మ్యాజిక్ ఫిగర్
పాట్నా: ప్రాణాంతక కరోనా వైరస్ నుంచి విముక్తి కల్పిస్తామంటూ జనతాదళ్ (యునైటెడ్)-భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ఇచ్చిన హామీలను బిహారీయులు నమ్మలేదనేది తేలిపోతోంది. కరోనా వ్యాక్సిన్ను ఎరగా వేసి, బిహార్ ఓటుబ్యాంకును కొల్లగొట్టడానికి జేడీయూ-బీజేపీ నేతలు చేసిన ప్రయత్నం బెడిసికొట్టినట్టే కనిపిస్తోంది. బిహార్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడటానికి అవకాశం ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను ఏ పార్టీకి కూడా లభించకపోవచ్చంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రీయ జనతాదళ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నాయి.
టైమ్స్నౌ-సీ ఓటర్ సర్వే: హంగ్ దిశగా బిహార్ అసెంబ్లీ: నితీష్ కుమార్కు చుక్కలే: ఆర్జేడీకి ఎడ్జ్
అసెంబ్లీ ఎన్నికల ప్రారంభానికి ముందు జేడీయూ-బీజేపీ ఇచ్చిన హామీల పట్ల బిహారీ ఓటర్లు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనట్టేననే అభిప్రాయాలు ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా వ్యక్తమౌతున్నాయి. అయిదేళ్ల వ్యవధిలో 19 లక్షల ఉద్యోగాలను ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది బీజేపీ. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా దీన్ని విడుదల చేశారు. బిహార్కు ప్రత్యేక ప్యాకేజీలనూ ఆమె ప్రకటించారు. అవేవీ కూడా జేడీయూ-బీజేపీ కూటమికి ఈ ఎన్నికలను ఏకపక్షంగా మార్చడానికి దోహదపడలేదనేది తేలిపోతోంది.. ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా.
వాటిని ఎన్నికల జిమ్మిక్కుగానే అభివర్ణించారు విశ్లేషకులు. ఇప్పుడు వారి అంచనాలు నిజమయ్యే పరిస్థితి బిహార్లో ఏర్పడింది. కరోనా వ్యాక్సిన్ను ప్రతి బిహారీయుడికీ ఉచితంగా అందజేస్తామంటూ పేర్కొనడం వివాదాన్ని రేకెత్తించింది. హాస్యాస్పదంగా మారినట్లు అప్పట్లో విమర్శలు వ్యక్తం అయ్యాయి. వ్యాక్సిన్ను కూడా బీజేపీ ఎన్నికల ప్రచారానికి వినియోగించకుంటోందంటూ ఆర్జేడీ-కాంగ్రెస్ మహాకూటమి నేతలు ఆరోపణాస్త్రాలను సంధించారు. తాజాగా వెలువడుతోన్న ఎగ్జిట్పోల్స్ బట్టి చూస్తోంటే.. జేడీయూ-బీజేపీ ఇచ్చిన హామీలను బిహారీయులు పెద్దగా నమ్మలేదనేది తేలిపోయింది.