షాకింగ్: లోదుస్తుల్లోనే రైల్లో అటూ ఇటూ తిరిగిన ఎమ్మెల్యే గోపాల్ మండల్, ఫొటోలు వైరల్
పాట్నా: గోపాల్ మండల్.. ఈయన బీహార్ రాష్ట్రంలో అధికార జేడీయూ పార్టీకి చెందిన ఎమ్మెల్యే. ఈయన రైలులో లోదుస్తులతో ప్రయాణించడంపై తోటి ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాట్నా నుంచి ఢిల్లీ వెల్లే తేజస్ రాజధాని ఎక్స్ప్రెస్లో లోదుస్తులతోనే అటూ ఇటూ తిరగడంపై మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
లోదుస్తుల్లోనే ఎమ్మెల్యే ప్రయాణం..
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్యే గోపాల్ మండల్ గురువారం రైలు ఎక్కిన తర్వాత కడుపులో కొంత అసౌకర్యం ఏర్పడింది. దీంతో వెంటనే వాష్రూం వెళ్లేందుకు అతను వేసుకున్న కుర్తా, పైజామాను తీశారు. ఇక లోదుస్తుల్లోనే అటూ ఇటూ తిరిగారు. ఆయన వ్యవహారంతో తోటి ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే వ్యవహారంపై ప్రయాణికుల అభ్యంతరం
ఈ క్రమంలోనే ఎమ్మెల్యేతో కొందరు ప్రయాణికులు గొడవపెట్టుకున్నారు. రైల్వే అధికారులకు కూడా దీనిపై ఫిర్యాదు చేశారు. దీంతో రైల్వే అధికారులు ఇరువైపులా సర్ది చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే గోపాల్ మండల్ను వేరే కంపార్ట్మెంట్లోకి పంపారు. అయితే, లోదుస్తుల్లో ఉన్న ఎమ్మెల్యే పొటోలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. దీంతో నెటిజన్లతోపాటు బీహార్ ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎమ్మెల్యే ప్రవర్తనపై తోటి ప్రయాణికులు ఫిర్యాదు చేశారని, ఆర్పీఎఫ్, టీటీఈ జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేసినట్లు తూర్పు మధ్య రైల్వే సీపీఆర్వో రాజేష్ కుమార్ తెలిపారు.
ఏం జరిగిందంటే..?: ఎమ్మెల్యే గోపాల్ మండల్ వివరణ..
ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే గోపాల్ మండల్ శుక్రవారం వివరణ ఇచ్చుకున్నారు. రైలు ఎక్కగానే వాష్రూంకి హడావుడిగా వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. ఈ క్రమంలోనే తన కుర్తా, పైజామాని తీసేసినట్లు తెలిపారు. టవల్ను చుట్టుకునేందుకు బదులుగా తొందరలో భుజంపై వేసుకున్నట్లు చెప్పారు. రైలు ప్రయాణంలో కడుపులో ఇబ్బంది ఉండటం వల్లే తాను లోదుస్తుల్లోనే అటు ఇటు తిరిగినట్లు వెల్లడించారు. ఆ సమయంలో బోగీలో మహిళలు ఎవరూ లేరని చెప్పుకొచ్చారు. అయితే, తాను వాష్ రూంకి వెళ్లి బయటికి వచ్చిన తర్వాత తనతో ఓ వ్యక్తి గొడవపెట్టుకున్నాడని తెలిపారు. పోలీసులు వచ్చి మాట్లాడుతుండగా తనను నెట్టేశాడన్నారు. అయితే, తానే అతనికి క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు ఎమ్మెల్యే గోపాల్ మండల్.
బీహార్ పరువు తీస్తున్నారంటూ ఎమ్మెల్యేపై ఫైర్
మరోవైపు, ఎమ్మెల్యే గోపాల్ మండల వ్యవహారంపై బీహార్ ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. జేడీయూ బ్రాండ్ అంబాసిడర్, నితీశ్ కుమార్ ప్రియమైన ఎమ్మెల్యే లోదుస్తులతోనే మహిళల ముందు నడిచారని ఎద్దేవా చేస్తూ పోస్టులు పెడుతున్నారు ఆర్జేడీ నేతలు. ఇలాంటి ఘటనలే బీహార్ ప్రతిష్టను మసకబారుస్తున్నాయని ఎల్జేపీ ఎంపీ చిరాగ్ పాశ్వాన్ విమర్శించారు. ఇలాంటి ప్రజాప్రతినిధులకు ప్రజలతో ఎలా వ్యవహరించాలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రత్యేకంగా ట్యూషన్ చెప్పించాలని వ్యాఖ్యానించారు. కాగా, ఈ ఎమ్మెల్యే ఫొటోలు వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు కూడా ఎమ్మెల్యే మండల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రజాప్రతినిధిని అప్పుడే రైలు నుంచి తోసేయాల్సిందని మండిపడుతున్నారు. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి.. ఇలా వ్యవహరించడం సరికాదని అంటున్నారు. అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలతో ఎమ్మెల్యే మండల్ జనాలకు ఏం సందేశం ఇస్తున్నారని మండిపడుతున్నారు.