బీహార్ను యూరప్ చేస్తా.. మాస్క్ అప్పుడే తీస్తా: ఎవరీ మాస్క్డ్ బ్యూటీ!
Bihar Election 2025: లండన్లో ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత బీహార్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి సంచలనం సృష్టించిన పుష్పమ్ ప్రియ చౌదరి ఈ సారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేంద్ర బిందువుగా మారారు. ఆమె స్థాపించిన 'ది ఫ్లూరల్స్ పార్టీ' బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించిది. ఈ ఎన్నికల కోసం పుష్పమ్ ప్రియ స్వయంగా దర్భంగా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. బీహార్ అభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం తన పార్టీ ప్రధాన లక్ష్యాలను ఆమె స్పష్టం చేశారు. అంతేకాక మహిళలను రాజకీయాల్లోకి తీసుకురావడానికి కృషి చేస్తూ మొత్తం 122 స్థానాల్లో మహిళా అభ్యర్థులను నిలబెట్టాలని ఆమె పార్టీ నిర్ణయించింది.
పుష్పమ్ ప్రియ తరచుగా నల్లటి దుస్తులు ధరించి మాస్క్ తో కనిపించడం ఆమెకు ప్రత్యేక గుర్తింపుగా మారింది. ఈ మాస్క్ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని ఆమె తాజాగా వెల్లడించారు. "నేను ఎన్నికల్లో గెలిచినప్పుడు లేదా బీహార్ ముఖ్యమంత్రి పదవికి ఏదైనా పార్టీ మహిళను అభ్యర్థిగా ప్రకటించినప్పుడు మాత్రమే నా మాస్క్ను తీసివేస్తాను" అని ఆమె ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఈ మాస్క్ను ఆమె సాంప్రదాయ రాజకీయాలపై నిరసనగా.. మహిళా సాధికారతకు చిహ్నంగా వాడుతున్నారు.

పుష్పమ్ ప్రియ నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే.. ఆమెకు బలమైన రాజకీయ కుటుబ నేపథ్యం ఉంది. ఆమె తండ్రి వినోద్ చౌదరి జేడీయూ పార్టీలో ఎమ్మెల్సీగా(ఇప్పుడు మాజీ), నితీష్ కుమార్కు సన్నిహితుడిగా ఉండేవారు. పుష్పమ్ ప్రియ యూనివర్సిటీ ఆఫ్ సస్సెక్స్ నుంచి డెవలప్మెంట్ స్టడీస్లో ఎంఏ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎంపీఏ డిగ్రీలు పొందారు. రాజకీయాల్లోకి రాకముందు బీహార్ ప్రభుత్వ పర్యాటక, ఆరోగ్య శాఖలలో సలహాదారుగా కూడా పనిచేశారు. మార్చి 2020లో ఆమె 'ది ప్లూరల్స్ పార్టీ'ని స్థాపించారు.
2020 బీహార్ ఎన్నికల్లో కూడా పుష్పమ్ ప్రియ తనను తాను సీఎం అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆమె బిస్ఫీ, బాంకీపూర్ స్థానాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీహార్ను 2030 నాటికి యూరప్లాగా మారుస్తానని ఆమె గతంలో వాగ్దానం చేశారు. కుటుంబ రాజకీయాల వారసత్వం జేడీయూతో ముడిపడి ఉన్నప్పటికీ (ఆమె మామ జేడీయూ ఎమ్మెల్యే), పుష్పమ్ ప్రియ మాత్రం కులతత్వం, కుటుంబ పాలన ఆధిపత్యం చెలాయించే బీహార్ రాజకీయాలకు భిన్నంగా స్వతంత్ర మార్గాన్ని ఎంచుకున్నారు. 2020 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆమె మొత్తం ఆస్తి విలువ సుమారు రూ.15 లక్షలు. 2025 ఎన్నికలలో ఆమె ప్రచారం, వినూత్న లక్ష్యాలు బీహార్ రాజకీయాలపై ఎంతమేరకు ప్రభావం చూపుతాయో చూడాలి.












Click it and Unblock the Notifications