లెక్క తేలింది... కొలిక్కి వచ్చిన సీట్ల సర్దుబాటు.. బిహార్ మహాకూటమి సీఎం అభ్యర్థి ఎవరంటే...
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి విపక్ష మహాకూటమి పార్టీల మధ్య ఎట్టకేలకు సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చింది. మహాకూటమి తరుపున ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. ఈ మేరకు శనివారం(అక్టోబర్ 3) సాయంత్రం మహాకూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

ఎవరెవరు ఎన్ని స్థానాల్లో...
మహాకూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఆర్జేడీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 243 సీట్లకు గాను 143 సీట్లలో పోటీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే కాంగ్రెస్ 70 స్థానాల్లో,సీపీఐ(ఎం) నాలుగు స్థానాల్లో, సీపీఐ ఆరు స్థానాల్లో,సీపీఐ-ఎంఎల్ 19 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. తమకున్న 144 సీట్లలో బాలీవుడ్ సెట్ డిజైనర్ ముకేష్ సాహ్నికి చెందిన వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ(VIP),జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM) పార్టీలకు కూడా సీట్లను సర్దుబాటు చేయనున్నట్లు ఆర్జేడీ తెలిపింది.

లాలూ సూచనల మేరకే...
వీఐపీ అధ్యక్షుడు ముకేష్ సాహ్ని మాత్రం మహాకూటమిలో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వట్లేదని... కూటమిని వీడుతున్నామని ప్రకటించడం గమనార్హం.ప్రస్తుతం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీ జైల్లో ఉన్నప్పటికీ... అక్కడినుంచి బోలా యాదవ్ అనే ప్రత్యేక దూత ద్వారా సీట్ల సర్దుబాటుపై తన సందేశాన్ని చేరవేశారు. సీట్ల సర్దుబాటులో అనుసరించాల్సిన వ్యూహాలు,పట్టువిడుపులపై లాలూ కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
Recommended Video

ఎల్జేపీ-బీజేపీ సీట్ల పంచాయితీ...
మరోవైపు బీహార్లోని ఎన్డీయే కూటమి కూడా త్వరలోనే సీట్ల సర్దుబాటును చేపట్టే అవకాశం ఉంది. అయితే మిత్రపక్షం ఎల్జేడీ ఈసారి 143 స్థానాల్లో పోటీ చేసేందుకు పట్టుబడుతుండటంతో ఎన్డీయేలో ఆ పార్టీ కొనసాగడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా,గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ,జేడీయూ,కాంగ్రెస్ ఇతర చిన్న పార్టీలు కలిసి మహాకూటమిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కూటమిలో విబేధాల కారణంగా కొన్నాళ్లకే అది విచ్చిన్నమైంది. ఆ తర్వాత నితీశ్ బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో మిత్రులుగా పోటీ చేసిన పార్టీలు ఇప్పుడు శత్రువులుగా తలపడనున్నాయి.












Click it and Unblock the Notifications