బీహార్ వరదల్లో చిక్కుకున్న డిప్యూటీ సీఎం.. సురక్షిత ప్రాంతానికి తరలించిన ఎన్డీఆర్ఎఫ్
పాట్నా: బీహార్ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర రాజధాని పాట్నాలో అయితే ఎటు చూసిన వరదనీరే కనిపిస్తోంది. మోకాళ్లలోతుకు నీళ్లు చేరాయంటే అక్కడి పరిస్థితి ఎంత అద్వానంగా తయారైందో ఊహించొచ్చు. అయితే పాట్నాలో కురుస్తున్న భారీ వర్షాలకు కేవలం సామాన్యుడు మాత్రమే ఇబ్బంది పడలేదు. సాక్ష్యాత్తు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ కూడా వర్షాలకు చిక్కుకుపోయారు. దాదాపు మూడు రోజులుగా ఇంట్లో చిక్కుకుపోయిన సుశీల్ మోడీని అతని కుటుంబాన్ని ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి.
పాట్నాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ కుటుంబం తాము నివాసముంటున్న ఇంట్లోనే ఇరుక్కుపోయారు. దాదాపు మూడు రోజుల పాటు అక్కడే ఉంటూ ఇబ్బందులు పడ్డారు. ఎటు చూసినా రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. కాలు తీసి బయటకు అడుగు పెడదామంటే నీళ్లల్లో ఏమైనా విషపురుగులు ఉంటాయేమో అన్న భయం చాలామందిని వెంటాడింది. పాట్నాలోని రాజేంద్రనగర్లో ఉన్న తన నివాసం నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోటులో సుశీల్మోడీ కుటుంబాన్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాట్నా అతలాకుతలం అయ్యింది. అక్కడ జనజీవనం స్తంభించిపోయింది. అయితే సోమవారం వర్షం కాస్త బ్రేక్ ఇవ్వడంతో సహాయక చర్యలు ఊపందుకున్నాయి. అయితే వర్షాలు ఇప్పుడప్పుడే తగ్గుముఖం పట్టవని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక సహాయక చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం ఎయిర్ఫోర్స్కు చెందిన రెండు హెలికాఫ్టర్లను పంపింది. అక్టోబర్ 1 వరకు అన్ని పాఠశాలలను మూసివేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
#WATCH: Bihar Deputy Chief Minister Sushil Modi who was stranded at his residence in Patna, rescued by National and State Disaster Response Forces personnel. #BiharFlood pic.twitter.com/WwdbAcTWy6
— ANI (@ANI) September 30, 2019
ఇక పాట్నా నగరం ఇలా ధ్వంసం అవ్వడానికి కారణం నగరంలో వెలిసిన కట్టడాలే అని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఇక భారీ వర్షాలకు బీహార్లో 29 మంది మృతి చెందారు. మరోవైపు దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు 100కు పైగా ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గల్లంతయ్యారు. బీహార్లో ప్రస్తుతం పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. చాలా చోట్ల రైలు సేవలు నిలిచిపోయాయి. విద్యుత్కు తీవ్ర అంతరాయం కలిగింది. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఆరోగ్యశాఖపై కూడా వర్షం ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.