గంగానదిలో పడవ బోల్తా: ప్రమాద సమయంలో 100 మందికి పైగా: చివరిదశ పోలింగ్ వేళ కలకలం
బిహార్: అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్కు సమాయాత్తమౌతోన్న బిహార్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఘోర దుర్ఘటన సంభవించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిండుగా ప్రవహిస్తోన్న గంగానదిలో పడప ప్రమాదానికి గురైంది. బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇప్పటిదాకా ఒకరు మరణించారు. అయిదుమంది పరిస్థితి విషమంగా ఉంది. పలువురు గల్లంతయ్యారు. వారికోసం యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వారిలో మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారంతా వ్యవసాయ కూలీలని చెబుతున్నారు.
ప్రమాద సమయంలో వందమందికి పైగా పడవలో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సామర్థ్యానికి మించి అందులో స్థానికుల ఎక్కించుకోవడమే ఈ ప్రమాదానిక ప్రధాన కారణమని భావిస్తున్నారు. బిహార్లోని భాగల్పూర్ జిల్లా నవ్గచ్ఛియా ప్రాంతంలోని తీన్ టంగా కరారీ గంగా ఘాట్ సమీపంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ బలగాలతో సహాయక కార్యక్రమాలను చేపట్టారు.
తీన్ టంగా గంగా ఘాట్ వద్ద గంగానది రెండుపాయలుగా విడిపోతుంది. రాకపోకలు సాగించడానికి స్థానికులు పడవల మీద ఆధారపడుతుంటారు. ఎప్పట్లాగే ఈ ఉదయం కూడా స్థానికులు తీన్టంగా ఘాట్-దర్శనియా ఘాట్ మధ్య రాకపోకలు సాగించడానికి పడవను ఆశ్రయించారు. సామర్థ్యానికి మించి అందులో ఎక్కారు. వందమందికి పైగా పడవలో ఎక్కడంతో నదిలో కొంతదూరం వెళ్లిన తరువాత బోల్తా కొట్టింది. ఒడ్డునే ఉన్న మత్స్యకారులు, స్థానికులు అప్రమత్తం అయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Bihar: Several people missing after a boat capsized in Naugachhia area of Bhagalpur earlier today. There were over 100 people on board the boat, rescue and search operation underway. pic.twitter.com/2pre5AtBwW
— ANI (@ANI) November 5, 2020
వారు వచ్చేలోగా 30 మందిని రక్షించారు. వారిని గోపాల్పూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బలమైన ఈదురుగాలులు వీచాయని, పడవ సమతౌల్యాన్నికోల్పోయి బోల్తా కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ఘటనలో 20 మంది గల్లంతయినట్లు తెలుస్తోంది. వారి కోసం గాలిస్తున్నారు. ఆసుపత్రికి తరలించిన వారిలో సులేమా దేవీ అనే మహిళ మరణించారు. చందినీ దేవి, ఖైరా దేవి, రాణీ, షర్మిలా దేవీ, ప్రమీలా, ప్రేమలతా దేవి, మనీషా కుమారి, ఇందిరా దేవి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం మూడోదశ ఎన్నికలను నిర్వహించడానికి సమాయాత్తమౌతోన్న అధికార యంత్రాంగం ఈ ఘటనతో ఉలిక్కిపడింది.