పద్మావత్: గుజరాత్లో హింసాత్మకంగా మారిన ఆందోళన, దుకాణాలు ధ్వంసం, బైకులు దహనం
సంజయ్ లీలా భన్సాలీ చిత్రం ‘పద్మావత్’ విడుదలను ఆపివేయాలంటూ గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నగరంలో మంగళవారం రాజ్పుత్ కర్ణిసేన ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన చివరికి హింసాత్మకంగా మారింది.
Recommended Video
అహ్మదాబాద్: సంజయ్ లీలా భన్సాలీ చిత్రం 'పద్మావత్' విడుదలకు వ్యతిరేకంగా గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నగరంలో మంగళవారం సాయంత్రం రాజ్పుత్ కర్ణిసేన ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన చివరికి హింసాత్మకంగా మారింది.
అల్లరి మూకలు రెచ్చిపోయి అహ్మదాబాద్లోని ఓ షాపింగ్ మాల్లోని దుకాణాలను ధ్వంసం చేశారు. ఓ సినిమాహాల్ సమీపంలో నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాల్లో ఓ డజను వాహనాలను ఆందోళన కారులు తగలబెట్టారు.
తాజా హింస నేపథ్యంలో ఆందోళన కారులను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. పద్మావత్ సినిమా విడుదలను అడ్డుకోరాదని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ పలు రాష్ట్రాల్లో పెద్ద సవాల్గా మారింది.
రాజస్థాన్ హోం మంత్రి గులాబ్ చంద్ కటారియా మాట్లాడుతూ సుప్రీం తీర్పు నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవడం తప్ప మరో అవకాశం లేదని వ్యాఖ్యానించారు.
హర్యానాలోని గుర్గావ్లో అధికార యంత్రాంగం.. సినిమాహాళ్ల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఎలాంటి గొడవలు జరగకుండా ముందుగానే 144 సెక్షన్ విధించారు. మరోవైపు మహారాష్ట్ర మంత్రి జయకుమార్ రావల్ పద్మావత్ సినిమాను చూడొద్దని పిలుపునివ్వడం వివాదాస్పదంగా మారింది.
పీటీఐ వివరాల ప్రకారం.. గుజరాత్ ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్ మాట్లాడుతూ ఈ వివాదాస్పద చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని ఇప్పటికే పలు థియేటర్ల యజమానులు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు.
మంగళవారం సాయంత్రం బిగ్ సినిమా రెండు థియేటర్లలో ఒకదానిపై ఆందోళన కారులు దాడికి పాల్పడ్డారు. 'మేం పద్మావత్ సినిమాను ప్రదర్శించడం లేదంటూ బోర్డు అయినా ఆందోళనకారులు మా మాల్పై దాడికి పాల్పడ్డారు..' అని ఆందోళనకారుల చేతిలో ధ్వంసమైన మాల్ మేనేజర్ రాకేష్ మెహతా చెప్పారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని సినిమాహాళ్లను కూడా ఆందోళనకారులు టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కాన్పూర్లోని ఓ మాల్లోకి ప్రవేశించిన ఆందోళన కారులు అక్కడి సిబ్బందిపై చేయి చేసుకున్నారని, సినిమా పోస్టర్లు చింపేశారని ఓ పోలీసు అధికారి పేర్కొనడం తెలిపారు.
పద్మావత్ సినిమా విడుదలకు వ్యతిరేకంగా ఇండోర్, మోరెనా, గ్వాలియర్లలో కూడా ఆందోళనలు సాగుతున్నాయని, ఉజ్జయినిలో ఆందోళనకారులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు బలప్రయోగం చేయాల్సి వచ్చినట్లు వివరించారు.
ఈనెల 25న పద్మావత్ సినిమా విడుదల నేపథ్యంలో మల్టీప్లెక్స్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కోరుతూ ఈ సినిమా దర్శక నిర్మాతలు సోమవారం పోలీసు ఉన్నతాధికారులను కూడా కలిసినట్లు తెలుస్తోంది.
ముంబైలో ఈ సినిమా విడుదలయ్యే సినిమా థియేటర్లలో ముందు జాగ్రత్త చర్య కింద పోలీసు భద్రత కల్పించినట్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.