రావత్, మధులిక మరో ఇద్దరి మృతదేహాలే గుర్తింపు-మిగతా వారి కోసం డీఎన్ఎ శాంపిల్ కలెక్షన్స్
నిన్న తమిళనాడులోని కున్నూర్ హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయిన సీడీఎస్ బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య మధులికా రావత్, బ్రిగేడియర్ ఎల్.ఎస్ లిడ్డర్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్ మృతదేహాల్ని మాత్రమే ఇప్పటివరకూ గుర్తించారు. మిగతా మృతదేహాల్ని ఇంకా గుర్తించాల్సి ఉంది.
ఇవాళ తమిళనాడులోని సూలూరు ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన జవాన్ల మృతదేహాలు సాయంత్రం ఢిల్లీలోని పాలం ఎయిర్ బేస్ కు చేరుకున్నాయి. అక్కడ ప్రధాని మోడీ, రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, త్రివిధ దళాధిపతులు మృతదేహాలకు నివాళులు అర్పించారు. అయితే ఇందులో కేవలం నాలుగు మృతదేహాలు మాత్రమే గుర్తించడంతో వాటిని మాత్రమే అంత్యక్రియలకు పంపనున్నారు. మిగతా మృతదేహాల్నిగుర్తించిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంది.
హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయిన వారి పేర్లు తెలిసినప్పటికీ ప్రమాదం తర్వాత వెలికితీసిన మృతదేహాలు ఎవరివన్న దానిపై సందిగ్ఘత నెలకొంది. దీంతో మృతుల గుర్తింపు కోసం ఆర్మీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మృతుల కుటుంబ సభ్యుల డీఎన్ఏలను సేకరిస్తున్నారు. వాటిని మృతుల డీఎన్ఏలతో సరిచూశాక మృతదేహాల్ని గుర్తించేందుకు సాధ్యమవుతుంది.. అప్పటివరకూ మృతదేహాల్ని ఢిల్లీలోనే ఉంచనున్నారు. మృతదేహాల గుర్తింపు పూర్తయ్యాక మాత్రం వాటిని జవాన్ల స్వస్ధలాలకు పంపనున్నారు.
ఇప్పటికే ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబ సభ్యుల డీఎన్ఏను ఆర్మీ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. సైన్యంలోనే పనిచేస్తున్న ఆయన సోదరుడు మహేశ్ బాబు డీఎన్ఏ కూడా తీసుకున్నట్లు సమాచారం. వాటిని మృతదేహంతో సరిపోల్చిన తర్వాతే సాయితేజ భౌతిక కాయం రాష్ట్రానికి రానుంది. మరోవైపు సాయితేజ మృతితో చిత్తూరు జిల్లాలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. సాయితేజ పిల్లలకు అయితే ఇప్పటికీ తండ్రి మరణవార్తను కుటుంబ సభ్యులు తెలియనివ్వలేదు. దీంతో సాయితేజ మృతదేహం వచ్చే వరకూ పిల్లలతో పాటు భార్య కూడా వేచి చూడాల్సిన పరిస్ధితి. ఇప్పటికే సాయితేజ మృతిపై రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. సంతాప సందేశాలు పంపుతున్నారు.