పార్లమెంటు సమయం వృథా: జీతాన్ని తిరిగిచ్చేస్తానన్న ఎంపీ, ప్రశంసలు
ఇటీవల ముగిసిన పార్లమెంటు సమావేశాల సమయం అధికార, విపక్షాల ఆందోళనలతో చర్చ జరగకుండా ముగిసన నేపథ్యంలో బిజూ జనతా దల్(బీజేడీ) ఎంపీ బైజయంత్ జయ్ పాండ తన జీతాన్ని కొంత తిరిగిస్తానని స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన పార్లమెంటు సమావేశాల సమయం అధికార, విపక్షాల ఆందోళనలతో చర్చ జరగకుండా ముగిసన నేపథ్యంలో బిజూ జనతా దల్(బీజేడీ) ఎంపీ బైజయంత్ జయ్ పాండ తన జీతాన్ని కొంత తిరిగిస్తానని స్పష్టం చేశారు. లోకసభలో కీలకమైన అంశాలపై చర్చ జరగకుండా అధికార, విపక్షాలు ఆందోళనలు చేస్తూ సభా సమయాన్ని వృథా చేశాయని ఆయన అన్నారు.
కాగా, జయ్ పాండ తన జీతాన్ని తిరిగిచ్చేయడం ఇదే తొలిసారి కాదు. గత ఐదేళ్లుగా సభలు ఆందోళనలు జరిగి, సభా సమయం వృథా అయిన ప్రతిసారీ ఆయన తన జీతాన్ని తిరిగిచ్చేస్తున్నారు.
'గత నాలుగు నుంచి ఐదేళ్లుగా నేను ఇలాగే(జీతాన్ని తిరిగిచ్చేయడం) చేస్తున్నాను. నా జీతంలో కొంత భాగంతోపాటు అలవెన్స్లను కూడా ఇచ్చేస్తున్నా. లోకసభలో అధికార, విపక్షాల ఆందోళన కారణంగా సభ సజావుగా సాగడం లేదు' అని జయ్ పాండ తెలిపారు.

తాను తిరిగిచ్చే మొత్తం.. సభ కోసం చేసే ఖర్చుతో పోలిస్తే చాలా చిన్నదని అన్నారు. అంత పెద్ద మొత్తం ప్రజల సొమ్ము వృథా చేయడం సరికాదని అన్నారు. ఇందుకు నిరసనగా తాను తన జీతాన్ని తిరిగిచ్చేందుకు నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు.
పార్లమెంటు విలువైన సమయం వృథా అయినందుకు అందరూ కూడా తమ జీతాన్ని తిరిగిచ్చేయాలని అన్నారు. తన 16ఏళ్ల పార్లమెంటు జీవితంలో ఒక్కసారి కూడా సమావేశాలకు ఆటంకం కలగనీయలేదని తెలిపారు. ఇది తనకు వ్యక్తిగత బాధ్యత అని పేర్కొన్నారు.
కాగా, పాండ నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. పార్లమెంటు సమయాన్ని వృథా చేసినందుకు సభలోని ప్రతీ సభ్యుడు తన జీతంతోపాటు అలవెన్సులు కూడా తిరిగిచ్చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications