మమత ఫోటో మార్ఫింగ్ కేసులో ప్రియాంకకు రిలీఫ్
ఢిల్లీ : మమత బెనర్జీ ఫోటోల మార్ఫింగ్ కేసులో బీజేపీ కార్యకర్త ప్రియాంక శర్మకు రిలీఫ్ దొరికింది. సుప్రీంకోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ప్రియాంక శర్మ జైలు నుంచి విడుదలైన వెంటనే క్షమాపణలు చెప్పాలని జస్టిస్ ఇందిరా బెనర్జీ, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. క్షమాపణ కోరడంలో తప్పేంలేదన్న కోర్టు.. ఆమె భవిష్యత్ కోసమే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పింది. రాజకీయ పార్టీతో సంబంధమున్న ప్రియాంక శర్మ వంటి వారు చేసే పోస్టులకు, సాధారణ పౌరులు చేసే పోస్టులకు తేడా ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
దేశంలో ప్రతి ఒక్కరికీ వాక్ స్వాతంత్ర్య హక్కు ఉందన్న సర్నోన్నత న్యాయస్థానం దానికి కొన్ని పరిధులు ఉంటాయని చెప్పింది. ఇతరుల హక్కులకు ఎప్పుడైతే భంగం కలుగుతుందో అప్పుడే వాక్ స్వాతంత్ర్య హక్కు ముగుస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే ప్రియాంక శర్మ అరెస్ట్ విషయంలో బెంగాల్ పోలీసుల వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మెట్ గాలా ఫొటోను కాపీ చేసిన ప్రియాంక శర్మ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముఖంతో దాన్ని మార్ఫ్ చేశారు. ఫేస్బుక్లో పోస్టు చేసిన ఈ మార్ఫ్డ్ ఫొటోపై అభ్యంతరం వ్యక్తం చేసిన తృణమూల్ కాంగ్రెస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గత శుక్రవారం ఆమెను అరెస్ట్ చేశారు.