మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించండి: రామ్ నాథ్ కోవింద్కు కేంద్రమంత్రి అథవాలే వినతి
ముంబై: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణలు, ముకేష్ అంబానీ నివాసం ముందు సచిన్ వాజే వాహనం నిలిపిన పరిణామాల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు. అంతేగాక, గురువారం ఆయన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ను వినతి పత్రాన్ని అందించినట్లు తెలిపారు.
మహారాష్ట్రలో రాష్ట్రపతిపాలన విధించాలని కోరుతూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు విజ్ఞాపన పత్రాన్ని అందించినట్లు రాందాస్ అథవాలే తెలిపారు. తన డిమాండ్పై ఆలోచిస్తానని రాష్ట్రపతి తనతో చెప్పినట్లు వెల్లడించారు. ముకేష్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో పోలీస్ ఉన్నతాధికారి సంబంధం ఉండటం, నెలకు రూ. 100 కోట్లు వసూలు చేయాలని రాష్ట్ర హోమంత్రి అనిల్ దేశ్ముఖ్ పోలీసులకు టార్గెట్ పెట్టడం వంటి విషయాలు చాలా తీవ్రమైనవని ఆయన అన్నారు.
ఈ నేపథ్యంలోనే హోంమంత్రిపై దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇదే విషయంపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున రాష్ట్రపతిని కోరానని రాందాస్ అథవాలే తెలిపారు. మరోవైపు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని పలువురు బీజేపీ నేతలకు కూడా డిమాండ్ చేస్తున్నారు.
మాజీ సీం, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో పలువురు బీజేపీ ప్రజాప్రతినిధులు, నేతలు ఇప్పటికే రాష్ట్ర గవర్నర్కు కలిసి విన్నవించారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ను తొలగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం సీఎం ఉద్ధవ్ థాక్రే.. అవినీతి మంత్రులు, అధికారులకు కొమ్ముకాస్తున్నారని మండిపడుతున్నారు.