పాలక్కడ్ నుంచి పోటీలో మెట్రోమ్యాన్ శ్రీధరన్: కేరళలో 112 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
న్యూఢిల్లీ/తిరువనంతపురం: ఎన్నికలు జరుగుతున్న పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. కేరళలో మొత్తం 140 స్థానాలుండగా 112 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 115 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుండగా, మూడు స్థానాల్లో భాగస్వామ్య పార్టీలు పోటీ చేస్తున్నట్లు తెలిపింది.
మెట్రోమ్యాన్ శ్రీధరన్ పాలక్కడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ రెండు స్థానాల నుంచి(మంజేశ్వర్, కొన్ని)ల నుంచి పోటీ చేయనున్నారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కుమ్మనమ్ రాజశేఖరన్ నెమ్మమ్ స్థానం నుంచి పోటీ చేస్తారు.
కేంద్ర మాజీ మంత్రి కేజే అల్ఫోన్స్ కంజిరిప్పళ్లి స్థానం నుంచి, నటుడు సురేష్ గోపీ త్రిస్సూర్ నుంచి పోటీ చేయనున్నారు. ఏప్రిల్ 6న కేరళలో ఎన్నికలు జరుగనున్నాయి. మే 2న ఫలితాలు వెలవడనున్నాయి.
మరోవైపు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 63 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఆర్థిక శాఖ మాజీ ముఖ్య సలహాదారు అశోక్ లాహిరి అలీపుర్టౌర్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు తొల్లిగుంజె స్థానం కేటాయించారు. హుగ్లీ ఎంపీ లాకెట్ ఛటర్జీ చుంచురా నుంచి పోటీ చేస్తున్నారు. కూచ్ బెహార్ ఎంపీ నిసిత్ ప్రమాణిక్ దిన్హతా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
తమిళనాడులో మొత్తం 20 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ.. 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇటీవల బీజేపీలో చేరిన ఖుష్బూ సుందర్కు థౌజెండ్ లైట్స్ అసెంబ్లీ స్థానం కేటాయించారు. పార్టీ మహిళా చీఫ్ వసతి శ్రీనివాసన్.. కమల్ హాసన్ కు పోటీగా దక్షిణ కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తున్నారు. అసోం అసెంబ్లీ ఎన్నికలకు కూడా 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 126 స్థానాల్లో 92 స్థానాల్లో అభ్యర్థులను బీజేపీ నిలబెడుతోంది. మిగిలిన స్థానాలను భాగస్వామ్య పార్టీలకు కేటాయించింది.