ఫడ్నవీస్ గట్టెక్కేందుకు ఆ మాజీ ముఖ్యమంత్రికి బాధ్యతలు అప్పగించారు..ఎవరాయన?
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాజకీయం వేడెక్కింది. బలపరీక్షలో ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో బీజేపీ పావులు కదుపుతుండగా... ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ పార్టీలు కూడా అదే స్థాయిలో వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టులో మహా పంచాయతీ ఉంది. ఇక నవంబర్ 29న ఫడ్నవీస్ బలనిరూపణ చేసుకోవాల్సి ఉండగా శివసేన కాంగ్రెస్ పార్టీల నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలను తనకు మద్దతు ఇచ్చేలా చూడాలంటూ ఆ బాధ్యతన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత నారాయణ రాణేకు అప్పగించారు ఫడ్నవీస్.
ఒకప్పుడు కాంగ్రెస్ శివసేనలో ఉన్న నారాయణరాణే
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత నారాయణ రాణేకు కీలక బాధ్యతలు అప్పగించారు సీఎం ఫడ్నవీస్. తనకు పరిచయం ఉన్న కాంగ్రెస్ శివసేన పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను బలనిరూపణ సమయంలో ఫడ్నవీస్కు మద్దతు తెలిపేందుకు పావులు కదపాలని నారాయణ రాణేకు చెప్పడం జరిగింది. నారాయణ రాణే ఒకప్పుడు శివసేన, కాంగ్రెస్ పార్టీల్లో పనిచేశారు కనుక ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న నారాయణ రాణేకు ఇప్పటికీ కాంగ్రెస్ శివసేన పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలతో మంచి పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది.
శివసేనలో ఉద్దవ్ థాక్రే..కాంగ్రెస్లో అశోక్ చవాన్లు తప్ప...
2017లో కాంగ్రెస్ పార్టీని వీడే సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు నారాయణ రాణే.తనకు శివసేనలో ఒక్క ఉద్ధవ్ థాక్రే తప్ప అందరూ మంచి స్నేహితులే అని నాడు చెప్పిన చెప్పిన నారాయణ రాణే... అదేమాదిరిగా కాంగ్రెస్లో ఒక్క అశోక్ చవాన్ తప్ప అందరూ మంచి మిత్రులే అని చెబుతూ పార్టీ నుంచి బయటకు వచ్చారు. 2018లో బీజేపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు నారాయణ రాణే. ఆ సమయంలో బీజేపీ మిత్ర పక్షంగా ఉన్న శివసేన నుంచి ఎంతో వ్యతిరేకత వ్యక్తమైంది. అయినప్పటికీ బీజేపీ అధిష్టానం నారాయణ రాణేను రాజ్యసభకు పంపింది. ఇప్పుడు బీజేపీ రుణం తీర్చుకునే అవకాశం నారాయణ రాణేకు వచ్చిందని ఆ మేరకు పనిచేయాలని బీజేపీ భావిస్తోంది.
నారాయణరాణేను అవమానించిన ఉద్దవ్ థాక్రు
నవంబర్ 12వ తేదీన మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు తన శాయశక్తుల కృషిచేస్తానని నారాయణ రాణే చెప్పారు. శివసేన తనకు నేర్పిన సామదానబేధదండోపాయాలను అస్త్రాలుగా మారుస్తానని కూడా చెప్పారు. బీజేపీకి మద్దతుగా 40 నుంచి 45 ఎమ్మెల్యేలు మాత్రమే కావాల్సి ఉందని నొక్కి మరీ చెప్పారు. నారాయణరాణే యవ్వనప్రాయం నుంచే శివసేనతో అడుగులు వేశారు. అది గుర్తించిన అప్పటి అధినేత బాల్ థాక్రే 1999లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మనోహర్ జోషిని కాదని నారాయణ రాణే పేరును ప్రతిపాదించారు. అయితే ఉద్ధవ్ థాక్రే పలుమార్లు విమర్శలు గుప్పిస్తుండటం సొంత పార్టీ నేత అని కూడా చూడకుండా అవమానిస్తుండటంతో 2005లో శివసేన పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు.
నారాయణ రాణేకు బీజేపీ రుణం తీర్చుకునే సమయం వచ్చింది
పృథ్వీరాజ్ చవాన్ ప్రభుత్వంలో రెవిన్యూ శాఖ మంత్రిగా నారాయణరాణే పనిచేశారు. 2008లో కాంగ్రెస్ నాయకత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో ఆయన్ను సస్పెండ్ చేయడం జరిగింది. అయితే క్షమాపణలు కోరడంతో తిరిగి పార్టీలోకి కాంగ్రెస్ చేర్చుకుంది. ఇక డిసెంబర్ 2017లో తనకు కాంగ్రెస్లో విలువలేదని గ్రహించిన రాణే ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీ రుణం తీర్చుకునే అవకాశం నారాయణరాణేకు దక్కిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.