యూపీలో బీజేపీ అభ్యర్ధుల ఎంపిక- సమావేశమైన ఎన్నికల కమిటీ : అయోధ్య నుంచి యోగీ..!!
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల వేడి పెరుగుతోంది. ఆసక్తి కర రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ నుంచి రోజుకో మంత్రి ..కొందర ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారు. సమాజ్ వాదీ పార్టీ లో చేరుతున్నారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో..ఇక, పోటీ చేసే అభ్యర్దుల పైన ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. కాంగ్రెస్ 125 మందితో అభ్యర్ధుల జాబితా విడుదల చేసింది. ఉన్నావ్ బాధితురాలి తల్లికి కాంగ్రెస్ టిక్కెట్ కేటాయించింది. ఇక, బీజేపీ సైతం తమ అభ్యర్దుల ఎంపిక కోసం కసరత్తు చేస్తోంది.
తొలి రెండు విడతల అభ్యర్ధుల ఎంపిక పై
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ దీని కోసం సమావేశం అయింది. ప్రధాని మోదీ వర్చ్యువల్ గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలి మూడు విడతల్లో పోటీ చేసేందుకు సుమారు 170 మంది అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం.గత రెండు రోజులుగా అభ్యర్థుల ఖరారు, మిత్రపక్షాలకు కేటాయించే సీట్లపై కసరత్తు చేశారు హోం మంత్రి అమిత్ షా. బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు పార్టీకి చెందిన ముఖ్యులు, అప్నాదళ్ పార్టీ నేత అనుప్రియ పటేల్, ఇతర నేతలతో మంతనాలు జరిపారు.
తొలి సారి అసెంబ్లీకి యోగీ
కేంద్ర మంత్రులు అమిత్ షా, అనురాగ్ ఠాగూర్, ధర్మేంద్ర ప్రధాన్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లు వర్చువల్గా హాజరయ్యారు. ముఖ్యమంత్రి యోగీ అయోధ్య నుంచి పోటీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. లేని పక్షంలో మధుర నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. ఆయన ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రస్తుతం శాసన మండలి సభ్యుడుగా ఉన్నారు. 72 గంటల వ్యవధిలో ఇద్దరు మంత్రులు..ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ బీజేపీకి షాక్ ఇచ్చారు.
మిత్రపక్షాలతో సహా సీట్ల ఖరారుపైనే
తొలి రెండు విడతలకు సంబంధించిన అభ్యర్ధులను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండటంతో అక్కడి అభ్యర్ధులను తదుపరి సమావేశాల్లో ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది. అఖిలేష్ యాదవ్ తో ప్రధానంగా పోటీ ఎదుర్కొంటున్న బీజేపీ.. సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక చేపట్టింది. అయిదు రాష్ట్రాల్లో..అందునా ఉత్తరప్రదేశ్ లో తిరిగి అధికారం దక్కించుకోవటం పైనే బీజేపీ అగ్రనాయకత్వం ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఇదే సమయంలో మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపు పైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.