బీజేపీ కర్ణాటక రథ యాత్ర ప్లాప్ షో, నివేదిక అడిగిన అమిత్ షా, కష్టాలు, ఇప్పుడు ఏం చెప్పాలి!
Recommended Video
బెంగళూరు/న్యూఢిల్లి: కర్ణాటకలో బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవ కర్ణాటక నిర్మాణ పరివర్తనా యాత్ర ప్రారంభోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కార్యకర్తలు అనుకున్న స్థాయిలో ఎందుకు రాలేదు, మీరు ఏం చేస్తూన్నారు అంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటక బీజేపీ నాయకులకు క్లాస్ పీకారని తెలిసింది.
బీజేపీ రథ యాత్ర: మాజీ సీఎం యడ్యూరప్ప వాహనంపై బీజేపీ అసంతృప్తి కార్యకర్తల రాళ్ల దాడి!
బహిరంగ సభ అనుకున్నంత స్థాయిలో ఎందుకు విజయవంతం కాలేదనే విషయంపై నివేదిక ఇవ్వాలని అమిత్ షా కర్ణాటక బీజేపీ నాయకులకు సూచించారని వెలుగు చూసింది. బెంగళూరు నగర శివార్లలోని అంతర్జాతీయ వస్తు ప్రదర్శనా మైదానంలో గురువారం బీజేపీ బహిరంగ సభ సమావేశం జరిగింది.
225 నియోజక వర్గాలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరై నవ కర్ణాటక నిర్మాణ పరివర్తనా యాత్రను ప్రారంభించారు. కర్ణాటకలోని అన్ని నియోజక వర్గాల్లోని ప్రతి కమిటీ నుంచి ముగ్గురు చొప్పున ద్విచక్రవాహానాల్లో బెంగళూరు తరలిరావాలని నాయకులు ఆదేశించారు.
మూడు లక్షల మంది వస్తారు
కర్ణాటకలోని అన్ని ప్రాంతాల నుంచి సుమారు మూడు లక్షల మందికి పైగా అమిత్ షా బహిరంగ సభకు హాజరౌతారని నాయకులు అంచానా వేశారు. అయితే బీజేపీ నాయకులు అంచనాలు తల్లకిందులు అయ్యాయి. అమిత్ షా బహిరంగ సభ సమావేశానికి ఆలస్యంగా రావడంతో అప్పటికే అక్కడ వేచి ఉన్న కార్యకర్తలు వెళ్లిపోయారు.
సౌకర్యాలు లేవని జంప్
బహిరంగ సభ సమావేశానికి వచ్చిన కార్యకర్తలకు సరైన సౌకర్యాలు కల్పించడంలో నాయకులు పూర్తిగా విఫలం అయ్యారని, అందుకే అమిత్ షా అక్కడికి రాక ముందే కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిసింది. వచ్చిన కార్యకర్తలు సైతం నీరసంగా ఉండటం అమిత్ షా గమనించారని నాయకులు అంటున్నారు.
నాయకుల్లో సమన్వయ లోపం
బహిరంగ సభ సమావేశం నిర్వహణ బాధ్యతలు కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్. అశోక్, పార్లమెంట్ సభ్యురాలు శోభా కరందాజ్లేకు అప్పగించారు. ఆర్. అశోక్, శోభా కరందాజ్లే సమన్వయ లోపం కారణంగా కార్యకర్తలు బహిరంగ సభ సమావేశానికి రాలేదని ఆరోపణలు ఉన్నాయి.
ప్లాప్ కాలేదు, సక్సస్ అయ్యింది
బీజేపీ సీనియర్ నాయకుడు, బహిరంగ సభ సమావేశాలకు జనసమీకరణ చేసే విషయంలో దిట్ట అని పేరు తెచ్చుకున్న బీఎల్. సంతోష్ ను ఈ కార్యక్రమ నిర్వహణా బాధ్యతల నుంచి పూర్తిగా దూరం పెట్టారు. వివిధ జిల్లాల నుంచి వస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం వలనే వారు బెంగళూరు రాలేకపోయారని, అయినా బహిరంగ సభ ప్లాప్ కాలేదని, సక్సస్ అయ్యిందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఆ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప అంటున్నారు.