ఐదు రాజధానులు కావాలంటున్న బీజేపీ సీఎం-జగన్ మూడు తరహాలోనే- మోడీకి సవాల్
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం సిద్ధం కావడం, అందుకు దక్షిణాఫ్రికాలో మూడు రాజధానుల్ని ఉదాహరణగా చూపడం, రెండు కమిటీలతో అధ్యయనం చేయించి అభివృద్ధి వికేంద్రీకరణ కావాలనడం చూశాం. దానికి కేంద్రం తొలుత మద్దతివ్వడం, ఇప్పుడు బీజేపీ దాన్ని వ్యతిరేకించి అమరావతే రాజధాని కావాలని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. కానీ బీజేపీ అధికారంలో ఉన్న అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఇప్పుడు ఐదు రాజధానులు కావాలంటున్నారు. అయితే అది తన రాష్ట్రంలో కాదు దేశంలో కావడం విశేషం.
Recommended Video

జగన్ మూడు రాజధానులు
ఏపీలో చంద్రబాబు తెచ్చిన అమరావతి స్ధానంలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం జగన్ సర్కార్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే హైకోర్టు ఈ ప్రతిపాదనను తిరస్కరించినా.. వైసీపీ సర్కార్ మాత్రం పట్టు వీడటం లేదు. త్వరలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం ద్వారా మూడు రాజధానుల్ని మరోసారి తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో జగన్ సర్కార్ మూడు రాజధానుల వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. గతంలో ఈ మూడు రాజధానుల వ్యవహారంతో తమకు సంబంధం లేదని హైకోర్టుకు కేంద్రం చెప్పింది. అయితే బీజేపీ మాత్రం అమరావతి రాజధానికే కట్టుబడ్డామని చెబుతూ ఉద్యమంలో పాల్గొంటోంది.

హిమంత ఐదు రాజధానుల డిమాండ్
ఇదిలా ఉంటే తాజాగా అసోంలో బీజేపీ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఐదు రాజధానుల డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. అయితే హిమంత కోరుతోంది అస్సోంలో ఐదు రాజధానులు కాదు. దేశంలో ఐదు రాజధానులు. ప్రస్తుతం ఢిల్లీలో రాజధాని కేంద్రీకృతం కావడం వల్ల మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి జరగడం లేదని, కేవలం హస్తినలోనే కేంద్రీకృతం అవుతోందని ఆయన ఆరోపిస్తున్నారు. కేజ్రివాల్ ఢిల్లీలో జరుగుతున్న అభివృద్ధి గురించి పెడుతున్న ట్వీట్లకు కౌంటర్ ఇచ్చే క్రమంలో హిమంత అందుకే ఐదు రాజధానుల్ని పెట్టాలని ఆయన కోరారు.

మోడీ మనసులో ఏముంది?
ఏపీలో మూడు రాజధానుల ప్రస్తావన వస్తే అమరావతిలో గతంలో రాజధాని పెట్టాం కాబట్టి ఇప్పుడు కూడా దానికే మద్దతిస్తామని బీజేపీ చెబుతోంది. అదే సమయంలో జగన్ సర్కార్ మూడు రాజధానులకు ప్రత్యేకంగా అడ్డంకులేవీ సృష్టించడం లేదు. కానీ అసోం సీఎం హిమంత కోరుతున్నట్లుగా ఢిల్లీ స్ధానంలో ఐదు రాజధానుల చర్చ మొదలైతే అప్పుడు మోడీ సర్కార్ ఏం చేస్తుందన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. రాష్ట్రాల్లో బహుళ రాజధానుల్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ దేశంలో బహుళ రాజధానులు కోరుకుంటుందా అనే చర్చ మొదలైంది. ఇప్పటికే ఢిల్లీలో తమను చికాకు పెడుతున్న కేజ్రివాల్ కు కత్తెర వేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగానే ఈ వాదనను తెరపైకి తెస్తోందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏదేమైనా మోడీ దీనిపై స్పందిస్తే తప్ప బీజేపీ వ్యూహం బయటపడేలా కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications