పిఎం అభ్యర్థి మోడీ: రాజ్నాథ్ ప్రకటన, అద్వానీ డుమ్మా
న్యూఢిల్లీ: ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పేరును ఖరారు చేస్తూ బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సమావేశమైన సమావేశం నరేంద్ర మోడీ పేరును ఖరారు చేసింది. ఈ సమావేశానికి బిజెపి అగ్రనేత ఎల్కె అద్వానీ డుమ్మా కొట్టారు.
ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరును ఖరారు చేసినట్లు సమావేశానంతరం బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నరేంద్ర మోడీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మోడీ అభ్యర్థిత్వానికి అద్వానీ ఆశీస్సులున్నాయని ఆయన చెప్పారు. పార్టీ నేతలు మోడీకి అభినందనలు తెలిపారు. బిజెపి నేత సుష్మా స్వరాజ్ మీడియా సమావేశంలో మోడీ పక్కనే కూర్చున్నారు. లోకసభ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీని గెలిపిస్తారని ఆశిస్తున్నట్లు రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
బిజెపి విజయానికి పూర్తి స్థాయిలో శ్రమిస్తానని నరేంద్ర మోడీ చెప్పారు. తన పేరును ప్రధాని పదవికి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి వివిధ స్థాయిలో తాను పనిచేసినట్లు ఆయన తెలిపారు. పార్టీ తనకు పెద్ద బాధ్యతను అప్పగించిందని ఆయన అన్నారు. అందుకు ఆయన పార్టీకి ధన్యవాదాలు తెలిపారు.
తనకు ఎప్పుడూ వాజ్పేయి, అద్వానీ ఆశీస్సులున్నాయని ఆయన చెప్పారు. పార్టీ నిర్మాణంలో అద్వానీ పాత్ర గణనీయమైందని ఆయన అన్నారు. లక్షలాది మంది కార్యకర్తల ఆకాంక్ష మేరకు పార్టీ విజయం సాధిస్తుందని, దేశం ఎదుర్కుంటున్న సవాళ్లను పరిష్కరిస్తుందని ఆయన అన్నారు.
నరేంద్ర మోడీకి బిజెపి నేతలు రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అనంతకుమార్ మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఎ భాగస్వామ్య పక్షాలు కూడా మోడీ అభ్యర్థిత్వాన్ని అంగీకరించాయి. ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరును ప్రకటించబోతున్నట్లు సమావేశానికి ముందే రాజ్నాథ్ సింగ్ మిత్రపక్షాల నాయకులకు తెలిపారు. శివసేన, అకాలీదళ్ మోడీ అభ్యర్థిత్వానికి అంగీకారం తెలిపాయి.
అద్వానీ అసంతృప్తి లేఖ
ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించిన తీరుపై బిజెపి అగ్రనేత ఎల్కె అద్వానీ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన రాజ్నాథ్ సింగ్కు ఓ లేఖ రాశారు. పార్టీ పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన ఆవేదనను, బాధను రాజ్నాథ్ సింగ్కు వివరించినట్లు ఆయన తెలిపారు. కాగా, కర్ణాటకకు చెందిన మాజీ ముఖ్యమంత్రి యడ్యారప్ప మోడీకి మద్దతిస్తామని ప్రకటించారు.
కిషన్ రెడ్డి హర్షం
ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరును ప్రకటించడాన్ని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు మోడీని ప్రధానిగా కోరుకుంటున్నారని ఆయన హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో అన్నారు. దేశాన్ని గట్టెంచగలిగే సత్తా మోడీకి ఉందని తమ పార్టీ గుర్తించిందని ఆయన అన్నారు మోడీ నాయకత్వంలో బిజెపి రాష్ట్రంలో బలపడుతుందని ఆయన అన్నారు.
కాంగ్రెసు పార్టీ ఎంతగా విమర్శిస్తే మోడీని దేశ ప్రజలు అంతగా ప్రేమిస్తారని ఆయన అన్నారు. గుజరాత్ విషయంలో కూడా కాంగ్రెసు మోడీని తప్పు పట్టిందని, అయినా మోడీని గుజరాత్ ప్రజలు ఆదరించారని ఆయన అన్నారు. కుటుంబాల చేతుల్లో, వ్యక్తుల చేతుల్లో కాంగ్రెసు పార్టీ ఉందని, ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించే పద్దతి బిజెపిలో ఉందని ఆయన అన్నారు.
అద్వానీని ఒప్పిస్తాం: వెంకయ్య
పార్టీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించడంపై బిజెపి సీనియర్ నేత ఎం వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీనియర్ నేత అద్వానీని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు. పార్టీ సారథుల్లో ఒకరైన అద్వానీ పక్కన పెట్టలేదని ఆయన అన్నారు.
2014 ఎన్నికవల్లో ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించడంపై బీహార్ బిజెపి నేత సుశీల్ కుమార్ మోడీ హర్షం వ్యక్తం చేశారు. మోడీ కేవలం ఎన్డీయె అభ్యర్థి మాత్రమే కాదని, దేశ ప్రజల అభ్యర్థి అని ఆయన ట్విట్టర్లో అన్నారు.
ప్రధాన మంత్రి పదవికి నరేంద్ర మోడీ అర్హుడని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. మోడీ నాయకత్వంలోని దేశం అత్యున్నత శిఖరాలకు చేరుకుంటుందని ఆయన ట్వీట్ చేశారు.