'గోవులకేనా రక్షణ?, మహిళలకేది? మమతను అంత మాటంటే బీజేపీ పట్టించుకోదా?'
రాజ్యసభలో ఎస్పీ ఎంపీ జయాబచ్చన్ మాట్లాడుతూ.. కేంద్రంలో గోవులకు ఉన్నంత రక్షణ, మహిళలకు లేదని కంటతడి పెట్టుకున్నారు.
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తల నరకాలంటూ బీజేవైఎం(భారతీయ జనతా యువమోర్చా) నాయకుడు యోగేష్ చేసిన వ్యాఖ్యలు రాజ్యసభలో దుమారం రేపాయిం. తల నరికి తెచ్చినవారికి రూ.11లక్షలు ఇస్తామని ఆయన చేసిన ప్రకటనను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు రాజ్యసభలో లేవనెత్తారు.
మమతా తల నరికి తెచ్చినవారికి రూ.11లక్షలు: బీజేవైఎం నేత సంచలనం..
మమతపై బెదిరింపులకు పాల్పడిన బీజేపీ యువనేతపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేయగా.. అతనికి తమకు సంబంధం లేదంటూ బీజేపీ చేతులు దులుపుకోవడం గమనార్హం. వ్యాఖ్యలను ఖండించిన కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇదే విషయంపై ఎస్పీ ఎంపీ జయాబచ్చన్ మాట్లాడుతూ.. కేంద్రం గోవులను రక్షించడంలో చూపించిన శ్రద్ద, మహిళా రక్షణ విషయంలో మాత్రం చూపించడం లేదని జయాబచ్చన్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మంగళవారం నాడు హనుమాన్ జయంతి సందర్బంగా యోగేష్ వార్ష్నే అనే బీజేవైఎం నాయకుడు మమతపై బెదిరింపు వ్యాఖ్యలు చేశాడు. హిందువుల పండుగకు మమత మద్దతుగా నిలవడం లేదని, ఆమె తల నరికి తెస్తే రూ.11లక్షల బహుమతి ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేశాడు.