టిపై డబుల్ గేమ్, మద్దతంటూనే మెలిక: బిజెపిపై కమల్
న్యూఢిల్లీ: తెలంగాణ విషయంలో కొన్ని పార్టీలు డబుల్ గేమ్ ఆడుతున్నాయని, తెలంగాణ ముసాయిదా బిల్లుకు పార్లమెంటులో మద్దతు ఇస్తామని చెబుతూనే మెలికలు పెడుతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ సోమవారం భారతీయ జనతా పార్టీ పైన మండిపడ్డారు. తెలంగాణపై అన్ని పార్టీలు తమ ద్వంద్వ వైఖరిని మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ బిల్లుపై పార్లమెంటు సభ్యులు ఆందోళన చేస్తే సభాపతి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
ప్రధాన ప్రతిపక్షం బిజెపి మాత్రం వారిని సస్పెండ్ చేయవద్దంటోందని ఆరోపించారు. సభను ఎంపీలు అడ్డుకోకుండా చూడాలని చెబుతూనే వారిని సస్పెండ్ చేస్తే వద్దని చెప్పడమేమిటని ప్రశ్నించారు. తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని, అవినీతికి వ్యతిరేకమని మీడియా ముందు చెబుతూ పార్లమెంటులో మాత్రం మరో రకంగా వ్యవహరిస్తారన్నారు. పార్టీల ద్వంద్వ వైఖరి వల్ల సభా సమయం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణపై ఏవోవే సాకులు చెబుతున్నారన్నారు.
పార్లమెంటులో సమావేశాలను అడ్డుకోవద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ప్రస్తుతం పెండింగ్ బిల్లులను పాస్ చేయించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లోకసభ, రాజ్యసభల్లో చాలా బిల్లులు పెండింగులో ఉన్నాయని తెలిపారు. లోకసభలో పాస్ అయిన పలు బిల్లులు రాజ్యసభలో, రాజ్యసభలో పాస్ అయిన పలు బిల్లులు లోకసభలో పెండింగులో ఉన్నాయని, 15వ లోకసభకు ఇవే చివరి సమావేశాలు అయినందున వాటిని ఆమోదింప చేసుకోవాల్సిన అవసరముందన్నారు.
ముఖ్యమైన బిల్లులకు రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సి ఉందన్నారు. సమావేశాలను ఆంటకపర్చవద్దని విపక్షాలను తాను కోరుతున్నానని చెప్పారు. ఆరు అవినీతి నిరోధక బిల్లులు పెండింగులో ఉన్నాయని, వాటికి అందరు సహకరించాలన్నారు. మహిళా బిల్లును రాజ్యసభ ఆమోదించిందని, లోకసభ ఎందుకు ఆమోదించకూడదన్నారు.