ఛత్తీస్ గఢ్ లో సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ షాక్
ఢిల్లీ : లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇందులో భాగంగా కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడటం లేదు. తాజాగా కమలదళం ఛత్తీస్ గడ్ లో 10 మంది సిట్టింగ్ ఎంపీలకు షాక్ ఇచ్చింది. వారందరికీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. సిట్టింగ్ ఎంపీల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది.
అసెంబ్లీ ఫలితాల ఎఫెక్ట్
బీజేపీ ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే కారణమని బీజేపీ జనరల్ సెక్రటరీ అనిల్ జైన్ స్పష్టం చేశారు. గతేడాది డిసెంబర్ లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ కేవలం 15 సీట్లు మాత్రమే ఖాతాలో వేసుకోగలిగింది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీలను బరిలో దింపితే అసెంబ్లీ తరహా ఫలితాలు రిపీట్ ఖాయమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే వారి స్థానంలో కొత్త అభ్యర్థులను పోటీలో నిలపాలని తద్వారా పార్టీకి నూతనోత్తేజం తీసుకురావాలని అనిల్ జైన్ ఆశిస్తున్నారు.

అనిల్ నిర్ణయానికి పార్టీ హైకమాండ్ ఆమోదం
10 మంది సిట్టింగ్ ఎంపీలను పక్కన బెట్టాలన్న జైన్ నిర్ణయానికి బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదం తెలిపింది. అంతేకాదు సిట్టింగ్ ఎంపీల సంబంధీకులెవరికీ టికెట్ ఇచ్చే ప్రసక్తేలేదని స్పష్టం చేసింది. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా కఠిన నిర్ణయాలు తప్పవని, కొత్త ముఖాలతో ఎన్నికల బరిలో నిలిచి విజయఢంకా మోగించాలని స్పష్టం చేసింది. ఇదిలాఉంటే ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్ రాజ్ నంద్ గావ్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications