మూడు రాష్ట్రాల సీఎంలపై ఎటూ తేల్చుకోలేని బీజేపీ-ఫలితాలొచ్చి వారం కావస్తున్నా..
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా మూడు రాష్ట్రాల్నిగెల్చుకున్న కేంద్రంలో అధికార బీజేపీ .. ఇప్పుడు వాటిలో ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలో మాత్రం మల్లగుల్లాలు పడుతోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘఢ్, రాజస్తాన్ లో ముఖ్యమంత్రి అభ్యర్ధుల్ని ప్రకటించకుండానే పోటీ చేసి గెలిచిన బీజేపీ.. ఇప్పుడు వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రుల్ని ఎంపిక చేయాల్సిన పరిస్ధితుల్లో ఉంది. దీంతో పాటు పార్టీలో అంతర్గత పోరు ఉండనే ఉంది.
మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్ లో ముఖ్యమంత్రుల ఎంపిక కోసం బీజేపీ జాతీయ స్ధాయిలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీల ఢిల్లీలో కొన్ని రోజులుగా చర్చోపచర్చలు జరుపుతోంది. అయినా మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులెవరన్న దానిపై సందిగ్ధం వీడలేదు. రేపు రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్ లో బీజేఎల్పీ భేటీల్ని అధిష్టానం ఏర్పాటు చేస్తోంది. అలాగే సోమవారం మధ్యప్రదేశ్ లో బీజేపీఎల్పీ భేటీ ఏర్పాటు చేసి శాసనసభా పక్ష నేతల్ని ఎంపిక చేయబోతోంది.

ఈ శాసనసభా పక్ష భేటీల్లో ఎమ్మెల్యేల మొగ్గు ఎటుంది, లోక్ సభ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ఎవరిని ఎంపికే చేయాలన్న దానిపై బీజేపీ కసరత్తు చేసే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యం కాబోతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే వారం మధ్యలో మూడు రాష్ట్రాల్లో కొత్త సీఎంల ప్రమాణస్వీకారాలు ఉంటాయని తెలుస్తోంది. అయితే సీఎంల ఎంపిక తర్వాత ఈ మూడు రాష్ట్రాల్లోనూ అసంతృప్తి చెలరేగే అవకాశం ఉండటంతో అధిష్టానం ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్ధితి.
వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున ఎంపీల్ని బీజేపీ ఆశిస్తోంది. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్తాన్ లో బీజేపీకి మెజార్టీ ఎంపీలున్నారు. ఈసారి ఛత్తీస్ ఘడ్ కూడా గెల్చుకోవడంతో అసెంబ్లీ ఎన్నికల ఊపును లోక్ సభ ఎన్నికల్లోనూ కొనసాగించాలని బీజేపీ పట్టుదలగా ఉంది. కేంద్రంలో మూడోసారి మోడీని ప్రధానమంత్రి చేయాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ.. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీతో పాటు ఈ మూడు రాష్ట్రాల్లోనే మెజార్టీ ఎంపీల్ని గెల్చుకోవాలని ప్లాన్ చేస్తోంది. దీంతో ముఖ్యమంత్రుల ఎంపిక కూడా దీనికి లింక్ అవుతోంది.












Click it and Unblock the Notifications