ఎన్నికలొస్తే.. మూడ్ ఆఫ్ ది నేషన్: వారు కలిస్తే బీజేపీకు చుక్కలు, జగన్ కలిస్తే మోడీకి తిరుగులేదు!
Recommended Video
న్యూఢిల్లీ: ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్ని సీట్లు తక్కువ పడతాయని ఇండియా టూడే - కార్వీ ఈన్సైట్స్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేలింది. 2014లో బీజేపీకి ఒంటరిగా 280కి పైగా సీట్లు వచ్చాయి. అయితే సొంతగా మిత్రధర్మం పాటించి సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కాకుండా ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి కొన్ని సీట్లు తగ్గుతాయని తాజా సర్వేలో తేలింది. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలను శనివారం సాయంత్రం విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడు నెలల సమయం ఉంది. ఇలాంటి సమయంలో మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఆసక్తిని రేపుతోంది. కాగా, ఈ సర్వేను ఆయా పార్టీల తీరు, ఎవరెవరు కలిసి ఉంటారు అనే అంశాన్ని బట్టి మూడు విధాలుగా సర్వే చేశారు.
ప్రధానమంత్రిగా మోడీకే మార్కులు
ప్రధానమంత్రి రేసులో నరేంద్ర మోడీకే మార్కులు పడుతున్నాయి. 2014కు ముందు అంచనాలను అందుకోలేదని విపక్షాలు విమర్శిస్తున్నప్పటికీ, కొంత ఆదరణ తగ్గినప్పటికీ మోడీనే ఎక్కువగా ప్రజలు విశ్వసిస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీకి 49 శాతం మంది ఓటు వేస్తే, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి 27 శాతం మంది ఓటేశారు. ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఓటు షేర్ పెరిగినప్పటికీ, సీట్ల పెరుగుదలలో ఆశించినంత ఉండదని సర్వేలో తేలింది.
2014లోని ఎన్డీయే, యూపీఏ అలాగే ఉంటే
సర్వే ప్రకారం.. 2014లో ఏ పార్టీలు అయితే ఎన్డీయేలో, యూపీఏలో ఉన్నాయో అలాగే ఉంటే యూపీఏకు 122 స్థానాలు, ఎన్డీయేకు 271 స్థానాలు వస్తాయి. ఇతరులు 140 సీట్లు గెలుస్తారు. ఎన్డీయేకు 36 శాతం ఓట్లు, యూపీఏకు 31 శాతం ఓట్లు, ఇతరులకు 33 శాతం ఓట్లు వస్తాయి.
వారు కలిస్తే బీజేపీకి చుక్కలే
బీఎస్పీ, ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో యూపీఏ కలిసి వెళ్తే ఈ కూటమి 224 సీట్లు గెలుచుకునే అవకాశముంది. అప్పుడు ఎన్డీయేకు పెద్ద దెబ్బ పడనుంది. బీజేపీ కూటమి 228 స్థానాలు గెలుచుకుంటుంది. అంటే విపక్షాలు అన్ని కలిస్తే బీజేపీకి నాలుగు సీట్లు మాత్రమే ఎక్కువగా వచ్చే అవకాశముంది. ఇతరులు 91 స్థానాలు గెలుస్తారు. అప్పుడు ఎన్డీయేకు 36 శాతం, యూపీఏకు 41 శాతం, ఇతరులకు 23 శాతం సీట్లు వస్తాయి.
వైసీపీ, అన్నాడీఎంకే బీజేపీతో కలిస్తే
దక్షిణాదిని చూసుకుంటే వైయస్సార్ కాంగ్రెస్, అన్నాడీఎంకే పార్టీలు ఎన్డీయేకు అనుకూలంగా ఉన్నాయని చర్చించుకుంటున్నారు. ఈ యాంగిల్లోను సర్వే చేశారు. దక్షిణాదిలో కీలక పార్టీలైన అన్నాడీఎంకే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు కలిస్తే ఎన్డీయేకు 255 సీట్లు, యూపీఏకు 242 సీట్లు వస్తాయని అంచనా. ఇతరులకు 46 సీట్లు వస్తాయి. ఎన్డీయే ఓటు షేర్ 41 సాతం, యూపీఏ ఓట్ షేర్ 43 శాతం, ఇతరుల ఓట్ షేర్ 16 శాతంగా ఉంటుందని తేలింది.
టీఆర్ఎస్, బీజేడీ కూడా కలిస్తే
టీఆర్ఎస్, బీజేడీలు కూడా ఎన్డీయేతో జతకడితే ఈ కూటమి సులభంగా అధికారం చేజిక్కించుకుంటుందని, వీరికి 282 సీట్లు వస్తాయని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేలంది. అలా అయితే యూపీఏకు చాలా దూరంలో ఎన్డీయే ఉంటుంది. మరోవైపు, వచ్చే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆ ప్రభావం కూడా పడుతుందని తేలింది.