బీజేపీకి ఉపఎన్నికల షాక్- నాలుగు రాష్ట్రాల్లో వెనుకంజ-ప్రత్యర్ధుల్లో జోష్
ఈ ఏడాది ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో గెలుపుతో ఊపుమీదున్న బీజేపీకి తాజాగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికలు షాకిచ్చేలా కనిపిస్తున్నాయి. బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ లోని నాలుగు అసెంబ్లీ సీట్లు, ఓ లోక్ సభ సీటుకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులు వెనుకంజలో ఉన్నారు.
పశ్చిమబెంగాల్లోని అసన్ సోల్ లోక్ సభ సీటుతో పాటు బల్లీగంజ్ అసెంబ్లీ సీటుకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధుల్ని వెనక్కి నెట్టి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్ధులు దూసుకుపోతున్నారు. ముఖ్యంగా అసన్ సోల్ లోక్ సభ సీటులో తృణమూల్ అభ్యర్ధిగా పోటీ చేసిన శతృఘ్నసిన్హా ఇప్పటికే లక్షకు పైగా మెజారితో బీజేపీ అభ్యర్ధిపై ఆధిక్యం సాధించారు. అలాగే బల్లీగంజ్ అసెంబ్లీ సీటులో మాజీ కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో కూడా సీపీఎం, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్ధుల కంటే దాదాపు 12 వేలకు పైగా ఓట్ల ముందున్నారు. దీంతో ఈ రెండు సీట్లు టీఎంసీ ఖాతాలో పడేలా ఉన్నాయి.

అలాగే ఛత్తీస్ ఘడ్ లోని ఖైరాగర్ అసెంబ్లీ స్ధానానికి జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి సమీప బీజేపీ ప్రత్యర్ధి కంటే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇదే కోవలో బీహార్ లోని బోచాహన్ అసెంబ్లీ సీటుకు జరిగిన ఉపఎన్నికలో విపక్ష ఆర్జేడీ అభ్యర్ధి ఆధిక్యంలో ఉన్నారు. మహారాష్ట్రలోని కొల్హాన్ పూర్ నార్త్ లోనూ బీజేపీకి కలిసి రావడం లేదు.
అక్కడ కూడా మహావికాస్ అఘాడీ అభ్యర్ధి ఆధిక్యం కొనసాగుతోంది. ఇదే సరళి కొనసాగితే ఈ ఐదు సీట్లలోనూ విపక్ష అభ్యర్ధులు విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో గెలుపు తర్వాత 2024 ఎన్నికల్లోనూ మాదే గెలుపని ప్రకటించుకున్న బీజేపీకి ఈ ఫలితాలు మింగుడు పడటం లేదు.












Click it and Unblock the Notifications